HYD : ఫ్రెండ్స్‌తో కలిసి ఆటో ప్రయాణికుడిని బెదిరించి దోపిడీ

ABN , First Publish Date - 2021-11-30T13:29:12+05:30 IST

బావ దగ్గరకు వెళ్లడానికి ఆటో ఎక్కిన ప్రయాణికుడిని...

HYD : ఫ్రెండ్స్‌తో కలిసి ఆటో ప్రయాణికుడిని బెదిరించి దోపిడీ

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌/లంగర్‌హౌస్‌: బావ దగ్గరకు వెళ్లడానికి ఆటో ఎక్కిన ప్రయాణికుడిని కత్తితో బెదిరించి రూ.3 వేలు, సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. కోదాడకు చెందిన దుద్దిళ్ల నాగార్జున పెయింటర్‌. అతడి తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మందులు కొనేందుకు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చాడు. ఆదివారం రాత్రి 10 గంటలకు ఎల్‌బీనగర్‌లో మెట్రోరైలు ఎక్కి లక్డీకాపూల్‌లో దిగాడు. అక్కడి నుంచి మెహిదీపట్నం వరకు బస్‌లో వచ్చాడు. మెహిదీపట్నం వచ్చే సరికి రాత్రి 10:30 కావడంతో షేక్‌పేట్‌ ఓయూ కాలనీకి వెళ్లడానికి ఓ ఆటో ఎక్కాడు. అప్పటికే ఆటోలో ఇద్దరున్నారు. 


ఆటో నానల్‌నగర్‌ నుంచి నేరుగా వెళ్లకుండా లంగర్‌హౌజ్‌ వైపు వెళ్తుండడంతో రూటు తెలిసిన నాగార్జున ఆటో డ్రైవర్‌ను ప్రశ్నించాడు. డ్రైవర్‌ బదులివ్వకపోగా ఆటోలో కూర్చున్న ఇద్దరు అతడి గొంతుపై కత్తిపెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. బండ్లగూడ సన్‌సిటీ వద్దకు వెళ్లిన తర్వాత ఆటో ఆపి నాగార్జున వద్ద ఉన్న రూ. మూడు వేలు, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అక్కడ అతడిని దించి వెళ్లిపోయారు. విషయాన్ని దారినపోయే వారికి తెలిపి, ఓయూ కాలనీకి వెళ్లడానికి డబ్బులు అడుక్కుని ఎలాగోలా బావ ఇంటికి చేరుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం వాట్సా్‌ప్‌లో చక్కర్లు కొట్టడంతో బాధితుడు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం గమనార్హం.

Updated Date - 2021-11-30T13:29:12+05:30 IST