గంజాయి రవాణా.. కొత్త నమూనా!

ABN , First Publish Date - 2021-03-06T05:06:12+05:30 IST

గంజాయి రవాణాకు అశ్వారావుపేట కేంద్ర బిందువుగా మారుతోందా? అక్రమార్కులు ఈ ప్రాంతాన్నే ఇందుకు అనువైన మార్గంగా ఎంచుకున్నారా? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సంఘటనలు ఇందుకు బలం చేకుర్చుతున్నాయి.

గంజాయి రవాణా.. కొత్త నమూనా!
దమ్మపేటలో పోలీసులకు పట్టుబడిన గంజాయి(ఫైల్‌ఫొటో)

అశ్వారావుపేట కేంద్రంగా దర్జాగా తరలింపు

ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రాకు సరిహద్దు ప్రాంతం కావడంతో స్మగ్లర్ల ఎత్తుగడ

ఇటీవల పోలీసుల తనిఖీల్లో భారీగా పట్టుపడిన సరుకు

అశ్వారావుపేట, మార్చి 5: గంజాయి రవాణాకు అశ్వారావుపేట కేంద్ర బిందువుగా మారుతోందా? అక్రమార్కులు ఈ ప్రాంతాన్నే ఇందుకు అనువైన మార్గంగా ఎంచుకున్నారా? అంటే ఔననే సమాధానాలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సంఘటనలు ఇందుకు బలం చేకుర్చుతున్నాయి. హైదరాబాదు, వరంగల్‌ ప్రాంతాలకు ఏపీలోని విశాఖపట్నం, నర్సిపట్నం, రంపచోడవరం, ఒడిశా ప్రాంతాల నుంచి, అటు ఛత్తీస్‌గఢ్‌ నుంచి నిత్యం భారీగానే గంజాయి అక్రమరవాణా జోరుగా సాగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం నుండి హైదరాబాదు, వరంగల్‌ ప్రాంతాలకు అశ్వారావుపేట మీదుగా రవాణా అవుతోంది. స్మగ్లర్లు లారీలలో వివిద రకాల సామగ్రి, లోడుల మధ్య గంజాయిని ఉంచి ఎవరికీ అనుమానం రాకుండా రవాణా చేస్తున్నారు. అశ్వారావుపేట ప్రాంతంలో అవతలవైపున జీలుగుమిల్లి వద్ద ఏపీకి చెందిన చెక్‌ పోస్టు, ఇటు తెలంగాణకు చెందిన రవాణా చెక్‌ పోస్టులు ఉన్నప్పటికి స్మగ్లర్లు వారికి దొరక్కుండా గంజాయి రవాణా చేస్తున్నారు. ఇటీవలే దమ్మపేట మండలంలో రూ. కోటి గంజాయి పట్టుబడింది. కొద్దిరోజుల క్రితం సత్తుపల్లి, తల్లాడ, వైరా, ఖమ్మంలోను గంజాయి పట్టుపడిం ది. అశ్వారావుపేట, జీలుగుమిల్లి ప్రాంతాలలో కూడా భారీగా గంజాయి పట్టుబడ్డ సంఘటనలు ఉన్నాయి. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లర్లుపై కఠినమైన చట్టాలు ప్రయోగించే వీలు లేకపోవడంతో త్వరతిగతినే బెయిల్‌పై వచ్చి మరలా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి

నియోజవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, ములకలపల్లి ప్రాంతాలలో గంజాయితో పాటు పలు రకాల మత్తు పదార్థాలమ్ము తున్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొత్తగూడెం వ్యాపారులు ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మత్తు పదార్థాలను యువకులకు విక్రయిస్తున్నట్టు సమాచారం. వీటికి అలవాటు పడ్డ కొందరు యువకులు గంజాయే కాక మత్తునిచ్చే టానిక్‌లు, మాత్రలు, ఇంజక్షన్లను వాడుతున్నట్టు సమాచారం. పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే గంజాయి రవాణాతో పాటు మత్తుపదార్థాల విక్రయాలకు చెక్‌ పడే అవకాశం ఉంటుందని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2021-03-06T05:06:12+05:30 IST