మాకు రక్షణ కల్పించండి
ABN , First Publish Date - 2022-07-07T06:15:26+05:30 IST
తమకు రక్షణ కల్పించాలని, తమ ఇళ్లలో నివసించేందుకు అనువైన వాతావరణ కల్పించాలని కోరుతూ బందరుమండలం గరాలదిబ్బకు చెందిన పలు కుటుంబాలు బుధవారం డీఎస్పీ మాసుంబాషాకు వినపతిపత్రం అందజేశారు.
ఎస్పీకి గరాలదిబ్బ బాధిత కుటుంబాల వినతి
తమ ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని వినతి
మచిలీపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : తమకు రక్షణ కల్పించాలని, తమ ఇళ్లలో నివసించేందుకు అనువైన వాతావరణ కల్పించాలని కోరుతూ బందరుమండలం గరాలదిబ్బకు చెందిన పలు కుటుంబాలు బుధవారం డీఎస్పీ మాసుంబాషాకు వినపతిపత్రం అందజేశారు.ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో బాధితులు డీఎస్పీ వద్దకు వెళ్లారు. ఇటీవల గ్రామంలో ఇరువర్గాలమధ్య జరిగిన ఘర్షణలో బొడ్డు ఇంటిపేరు ఉన్న పెద్దలు 12 మందిపై తప్పుడుకేసులు బనాయించారన్నారు. ఒడుగు నాగరాజు అనే వ్యక్తి తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఒడుగు శివనాథంతో పాటు మరో 16మంది ఈనెల 2న తమ గృహాలపై మారణాయుధాలతో దాడి చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. తమను చంపేందుకు వెంటపడటంతో ప్రాణభయంతో గ్రామం విడిచి ఇతర గ్రామాల్లో బంధువుల ఇళ్లలో తలదాచుకున్నామని తెలిపారు. కొక్కిలిగడ్డ జయంతికి చెందిన ఇంటిని ధ్వంసం చేశారని, ఈ ఘటనపై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వివరించారు. దీనిపై ఇంకా కేసు తాలూకా పోలీసులు నమోదు చేయలేదని తెలిపారు. బొడ్డు బాలకోటేశ్వరరావు ఇంటిపై దాడిచేసి రెండు లక్షలు, బొడ్డు నాగేశ్వరరావు గృహంపై దాడిచేసి రూ. 1.50 లక్షలు దోచుకుపోయరని వినతిపత్రంలో పేర్కొన్నారు. బొడ్డుకుటుంబాలు, వారి బంధువులకు చెందిన 28 గృహాలను ధ్వంసం చేశారని, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారని, ఈ దాడులు వైసీపీ నాయకుల సూచనలమేరకే జరిగాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. అయినా వారిపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో గరాలదిబ్బలోని తమ గృహాలకు వెళ్లలేని పరిస్థితులున్నాయని, తమకు రక్షణకల్పించి గ్రామంలో నివసించే వాతావరణం కల్పించాలని వినతిప్రతంలో కోరారు. బొడ్డు బాలకోటేశ్వరరావు, కొక్కిలిగడ్డ జయంతి, బొడ్డు నిరీషా తదితరులు వినతపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. కొద్దిరోజులలో పరిస్థితిని చక్కదిద్దుతామని డీఎస్పీ ఈసందర్భంగా తెలిపారు.