తప్పుగా మాట్లాడితే క్షమించండి: గరికపాటి
ABN , First Publish Date - 2022-02-26T08:07:19+05:30 IST
తన వ్యాఖ్యల కారణంగా ఆందోళన చేపట్టిన విశ్వ బ్రాహ్మణులకు ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు క్షమాపణలు చెప్పారు.
భీమవరం క్రైం, ఫిబ్రవరి 25: తన వ్యాఖ్యల కారణంగా ఆందోళన చేపట్టిన విశ్వ బ్రాహ్మణులకు ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు క్షమాపణలు చెప్పారు. 2006 సంవత్సరంలో ఒక చానల్లో ఏర్పాటుచేసిన హాస్యం అనే కార్యక్రమంలో తమను కించపరిచే విధంగా మాట్లాడారని స్వర్ణకార వృత్తి చేసే విశ్వ బ్రాహ్మణులు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విశ్వ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఆనంద ఫంక్షన్ హాల్లో ప్రసంగం ఉండడంతో గరికపాటి వచ్చారు. ఈ సందర్భంగా స్వర్ణకారులు రోడ్డుపై భైఠాయించి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకి చేరుకుని వారితో చర్చలు జరిపారు. అనంతరం గరికపాటి.. విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులతో చర్చించారు. తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు.