గ్యాస్ మంట
ABN , First Publish Date - 2022-07-07T06:25:34+05:30 IST
సామాన్యుడిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం గుదిబండను మోపింది. రోజురోజుకూ ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మరోవైపు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తరచూ పెంచుతోంది.
- సామాన్యుడిపై మరోసారి సర్కారు బాదుడు
- సిలిండర్పై మరోసారి రూ.50 పెంపు
- రవాణా చార్జీల పేరిట అదనపు దోపిడీ
- పెరిగిన చార్జీలతో జిల్లాలో వినియోగదారులపై రూ.7కోట్ల అదనపు భారం
కామారెడ్డి, జూలై 6: సామాన్యుడిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం గుదిబండను మోపింది. రోజురోజుకూ ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మరోవైపు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తరచూ పెంచుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు అవస్థలు పడుతుంటే సబ్సిడీ గ్యాస్ ధరను నెలల వ్యవధిలోనే అనేక సార్లు పెంచుతూ రాగా ప్రస్తుతం 1,100 కి చేరింది. ఇలా వంటగ్యాస్ ధర తరచూ పెరగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలను ఆందోళన పరుస్తున్నాయి. మరోవైపు రవాణా చార్జీల పేరిట గ్యాస్ డిస్ర్టిబ్యూటర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు అదనపు వసూళ్లతో వంటగ్యాస్ సిలిండర్ సామాన్యులు మోయలేనంత బరువెక్కుతోంది.
సిలిండర్పై రూ.50 పెంపు
వంటగ్యాస్ సిలిండర్ ధరను కేంద్రప్రభుత్వం మరోసారి రూ.50 పెంచడంతో జిల్లా వినియోగదారులపై ప్రతీ నెల రూ.7 కోట్ల అదనపు భారం పడనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 20 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా ఈ ఏజెన్సీలో మొత్తం 2.20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన కామారెడ్డి జిల్లా వినియోగదారులపై పెంచిన ధరలతో రూ.7కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం నెలల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. గ్యాస్ ధర పెంపుపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఇలా వంటగ్యాస్ ధరను పెంచుకుంటూ పోవడం మంచిది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిత్యావసరానికి ఉపయోగించే వంటగ్యాస్ ధర భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వంటగ్యాస్ ధర మండిపోతుందని కొనుగోలు చేసిన గ్యాస్ సిలిండర్ను పొదుపుగా వాడుకోవాల్సి వస్తుందంటున్నారు. ఇలాంటి తరుణంలో గ్యాస్ సిలిండర్లను ఉపయోగించలేని పరిస్థితి కేంద్రప్రభుత్వం తీసుకువస్తుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధర పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడనుంది. దీంతో వంటలు చేసుకునేందుకు కట్టలపొయ్యే దిక్కవుతుందని ప్రజలు వాపోతున్నారు.
చార్జీల పెంపు ఒకవైపు.. అదనపు దోపిడీ మరోవైపు
జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు రవాణా చార్జీల పేరిట వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీలు 5 కిలో మీటర్ల పరిధిలో ఉచితంగా డోర్ డెలివరి చేయాలి. 30 కిలో మీటర్ల లోపు రూ.10లు, అంతకు ధర పెంచినప్పుడల్లా రవాణా చార్జీలు రూ.5 నుంచి పది వరకు పెంచుకుంటూ పొతున్నారు. కొన్ని ఏజెన్సీలు డోర్ డెలివరి చేయలేమని తమ వద్దకే వచ్చి తీసుకెళ్లాలని షరతులు పెడుతున్నారు. దీంతో వినియోగదారులు అవసరం కొద్ది అదనంగా సొమ్ము చెల్లించి గ్యాస్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో సిలిండర్ను డెలివరి చేయాలంటే డెలివరి బాయ్ సిలిండర్కు రూ.20 నుంచి 50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెంచిన ధరల ప్రకారం ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1,100 డెలివరీ బాయ్ చార్జీలు కలుపుకుంటే రూ.1,150కి చేరుతోంది. ఇలా గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగించలేని పరిస్థితి ఎదురవుతుందని వినియోగదారులు పేర్కొంటున్నారు.
పల్లెల్లో అటకెక్కనున్న సిలిండర్
గ్రామీణ ప్రాంతాల్లో వంట చెరుకు వినియోగాన్ని తగ్గించేందుకు దీపం పథకం, ప్రధాన మంత్రి ఉజ్వల యోజనలో సబ్సిడీపై గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అడవుల రక్షణ, మహిళల అనారోగ్యం దృష్ట్యా ఈ పథకాలను అమలు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు కనెక్షన్లు తీసుకున్నాక ధరలు పెంచుతూ వారు మోయలేనంత భారం మోపడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వారం రోజులు కష్టపడి సంపాధించిన కూలి డబ్బులను సిలిండర్కే వెచ్చిస్తే మిగతా అవసరాలు ఎలా తీరుతాయో అర్థం కావడం లేదని మహిళలు అంటున్నారు. పెరుగుతున్న ధరలతో మళ్లీ కట్టెల పొయ్యినే నమ్ముకునే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ ధర పెంపు సరికాదు
- లక్ష్మీనారాయణ, కామారెడ్డి
వంట గ్యాస్ ధరను నిత్యం పెంచడంతో సామన్య ప్రజలపై పెనుభారం పడుతుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ఏమి కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరోమారు గ్యాస్ ధరను పెంచడం సరికాదు. డెలివరీ చార్జీలతో కలిపి రూ.1,150లకు పైగానే చెల్లించాల్సి వస్తుంది. గ్యాస్పై వంట చేసుకునే పరిస్థితి లేదు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.