వాళ్లిద్దరూ దుమ్ముదులుపుతారు చూడండి: సునీల్ గవాస్కర్

ABN , First Publish Date - 2022-04-22T22:44:50+05:30 IST

ఐపీఎల్‌లో పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు బ్యాటర్

వాళ్లిద్దరూ దుమ్ముదులుపుతారు చూడండి: సునీల్ గవాస్కర్

ముంబై: ఐపీఎల్‌లో పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన కోహ్లీ ఈసారి ఒక్కో పరుగు కోసం చెమటోడుస్తున్నాడు. ఈ సీజన్‌లో కోహ్లీ ఇప్పటి వరకు చేసింది 119 పరుగులు మాత్రమే. రోహిత్ 114 పరుగులు మాత్రమే చేశాడు. 


అయితే, వీరి ఫామ్‌పై ఆందోళన చెందాల్సిన పనిలేదని, వారిద్దరూ తిరిగి గాడిన పడడానికి ఒక మంచి ఇన్నింగ్స్ చాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. రోహిత్ గురించి మాట్లాడుతూ, ఏడు మ్యాచుల్లో పెద్దగా పరుగులేమీ చేయకున్నా తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుందని అన్నాడు. ఆ జట్టుకు ఉన్న ఏకైక ఆశ అదొక్కటేనని పేర్కొన్నాడు. అతడు కనుక ఫామ్‌లోకి వస్తే, ఆ ప్రభావం మిగతా ఆటగాళ్లపైనా పడుతుందన్నాడు. రోహిత్ పెద్ద స్కోర్లు సాధిస్తే జట్టు కూడా భారీ స్కోర్లు సాధిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ముంబై జట్టుకు రోహిత్ ఫామ్ అత్యంత అవసరమని పేర్కొన్నాడు.


అయితే, కొన్నిసార్లు స్వీయ తప్పిదాలు, బ్యాడ్ పిచ్, ఓ మంచి డెలివరీ, మంచి క్యాచ్, ఇంకొన్నిసార్లు ఇన్‌సైడ్ ఎడ్జ్ వంటివి కూడా ఇబ్బందుల పాలు చేస్తాయన్నాడు.  కోహ్లీకి కూడా ఇంచుమించు ఇలానే జరుగుతోందన్నాడు. కోహ్లీ చేస్తున్న తొలి పొరపాటే చివరి పొరపాటు అవుతోందన్నాడు. అయితే, వీరిద్దరికీ ఇప్పుడు ఒకే ఒక్క ఇన్నింగ్స్ అవసరమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఒకసారి బిగ్ స్కోరు చేస్తే ఆ తర్వాత వారి బ్యాట్ల నుంచి పరుగులు జాలువారుతాయని గవాస్కర్ వివరించాడు.

Updated Date - 2022-04-22T22:44:50+05:30 IST