మాటల్లో దించి.. చోరీ చేసి

ABN , First Publish Date - 2021-11-26T05:02:43+05:30 IST

నగల వ్యాపారిని మాటల్లో దించి కేజీన్నర వెండి పట్టీలను చోరీ చేసిన ఘటన రణస్థలంలో గురువారం సాయంత్రం జరి గింది. వివరాల్లోకి వెళ్తే..

మాటల్లో దించి.. చోరీ చేసి
పట్టుబడిన దొంగలు

 కేజీన్నర వెండి పట్టీలు అపహరణ

  విశాఖకు చెందిన ముగ్గురు అరెస్టు 

రణస్థలం, నవంబరు 25: నగల వ్యాపారిని మాటల్లో దించి కేజీన్నర వెండి  పట్టీలను చోరీ చేసిన ఘటన రణస్థలంలో గురువారం సాయంత్రం జరి గింది.  వివరాల్లోకి వెళ్తే.. విశాఖ పట్నంకు చెందిన షేక్‌ భాను, ఎస్‌.త్రివేణి, టి.గణేష్‌లు రణస్థ లంలోని కనకదుర్గ జ్యూయలరీ షాప్‌నకు వచ్చారు. వెండి పట్టీలు కావాలని అడిగారు. దీంతో షాపు యజమాని కె.జగదీష్‌ వారికి వివిధ మోడళ్లలో పట్టీలను చూపించాడు. ఇందులో ఒక మహిళ జగదీష్‌ను మాటల్లో పెట్టగా మరో మహిళ కేజీన్నర వెండి పట్టీలను అపహరించింది. అనంతరం ఒక్కో జత మెట్టులు, పట్టీలను కొనుగోలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అరగంట తరువాత పట్టీలు పోయినట్లు జగదీష్‌ గుర్తించాడు. దీంతో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. దొంగలు ఎటువైపు వెళ్లారో తెలుసుకునేందుకు మరికొన్ని షాపుల వద్ద  సీసీ ఫుటేజీలను పరిశీలించారు. విశాఖపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సును ఎక్కినట్లు గుర్తించారు. తగరపువలస వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీన్నర వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు.   షాపు యాజమాని   ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-11-26T05:02:43+05:30 IST