ఘనంగా దుర్గాదేవి శోభాయాత్ర
ABN , First Publish Date - 2021-10-18T04:29:34+05:30 IST
దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని వివిధ గ్రామాల్లో తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు.
దుబ్బాక/మిరుదొడ్డి/చేర్యాల/రాయపోల్/హుస్నాబాద్, అక్టోబరు 17 : దుబ్బాక, మిరుదొడ్డి మండలాల్లోని వివిధ గ్రామాల్లో తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి అమ్మవారి చీరలను వేలం వేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు దుర్గాదేవి ఊరేగింపును నిర్వహించారు. చేర్యాల మండలంలో పలు యువజన, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాదేవీ శరన్నవరాత్రోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. స్థానిక చావడి వద్ద దేవీ స్నేహాయూత్, వేణుగోపాలస్వామి వీధిలో సాయి చైతన్యయూత్, మార్కండేయవీధి, బీడీ కాలనీ, భరత్నగర్, రాజీవ్నగర్లో సిద్దివినాయక యూత్, పెట్రోల్ పంప్ వద్ద దేవీ వాసవీ పరపతి సంఘం, బీడీ కాలనీతో పాటు అయ్యప్ప, మహమ్మాయి ఆలయాల్లో 11 రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. రాయపోల్ మండలం అనాజీపూర్, వడ్డేపల్లి తదితర గ్రామాల్లో ఆదివారం సాయంత్రం దుర్గాదేవి విగ్రహాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. వాహనాలను అలంకరించి అమ్మవారి విగ్రహాలను బాజా భజంత్రీలతో వీధుల్లో ఊరేగించారు. హుస్నాబాద్ పట్టణంలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమాలు ఆదివారం రాత్రి అత్యంత ఘనంగా జరిగాయి. డప్పుచప్పుళ్లు, యువకుల డ్యాన్సుల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేశారు.