Ghantasala: ఘనంగా ఘంటసాల శతగళార్చన..

ABN , First Publish Date - 2022-08-24T05:15:15+05:30 IST

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం

Ghantasala: ఘనంగా ఘంటసాల శతగళార్చన..

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 150 పైగా టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ పరంపరలో భాగంగా ముఖ్య అతిథిలుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.  10 మంది సహ నిర్వాహకులైన విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగతలతో కలసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులుతో  ఘంటసాల శత గళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించామని, మొదటి భాగాన్ని 21 ఆగష్టు నాడు ప్రసారం చేశామని నిర్వాహకులు తెలియజేశారు. మిగతా మూడు భాగాలు 28 ఆగస్టు, 4 సెప్టెంబర్, మరియు 11 సెప్టెంబర్‌లో ప్రసారం చేస్తామన్నారు.


ఘంటసాల స్వగృహంలో వారి కోడలు కృష్ణ కుమారి దైవారాధనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తరువాత.. వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ఘంటసాల రత్నకుమార్ నూరు కేంద్రాల్లో శతజయంతి కార్యక్రమాన్ని చేయాలనీ అనుకున్నారని, అనుకోకుండా వారు తమను విడిచి వెళ్లిపోవడంతో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కందాలమీద వేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం చేస్తున్న కృషి తమ కుటుంబానికి చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అలాగే మాష్టారు మొదటి వీరాభిమాని తానే అని, వారి కుటుంబంలోకి రావడం పూర్వజన్మ పుణ్యమని తెలియచేసారు. ఘంటాసాల సతీమణి సావిత్రమ్మ పంపిన సందేశంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాష్టారు అక్కడ ఉన్నట్లే భావించి జరుపుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలియచేసారు. ఇంతటి బృహత్కార్యాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.


మొదటి భాగంలో పాల్గొన్న ముఖ్య అతిథులు తనికెళ్ళ భరణి  మాట్లాడుతూ ఇంతటి విశ్వవేదికని పంచుకుంటున్న అందరికీ అభినందనలు తెలుపుతూ.. వారి మిథునం సినిమాలో ఒక సన్నివేశంలో వచ్చిన ఘంటసాల ఆలపించిన పుష్పవిలాపం గురించి గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ వారి పాటతోనే అందరు మేల్కొంటారని, వారి నడయాడిన ఊరుని సందర్శించినప్పుడు ఒక అనిర్విచమైన అనుభూతిని పొందానని చెపుతూ ఘంటసాల ఒక పరిపూర్ణ గాయకుడు, మంచి సంస్కారంగల మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఎప్పుడో 48 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వ్యక్తి కోసం వారికి భారతరత్న రావాలని అలుపెరగని పోరాటం చేస్తున్న నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందించారు... 

 

ప్రముఖ సినీ దర్శకులు  సుకుమార్  మాట్లాడుతూ.. ఘంటసాల అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పడానికి నిదర్శనం ఇప్పటికీ ప్రతి ఊరూ ఘంటాసాల పాటతోనే మేల్కొనడమేనని తెలిపారు. తాను విన్న మొదటి గొంతు ఘంటసాలదని చెప్పారు. చిన్నప్పుడు తన ఊరిలో దేవాలయంలో వారి పాట "నడిరేయి ఈ జాములో" అన్న పాటతోనే మేల్కోవడం జరిగేదని పేర్కుంటూ, ప్రతి ఊరిలో ఘంటసాల పాటలు పాడేవారు ఒక్కరయినా ఉంటారని, వారికి ఆ ఊరులో ప్రత్యేకస్థానం, గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా వారికి భారత రత్న ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు. 

 

శ్యాం అప్పాలి బృందం (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా) నుంచి సంధ్య ఈశ్వర, కళ్యాణి వల్లూరి, లలిత చింతలపాటి, కిరణ్ కొక్కిరి, ఫణి డొక్కా బృందం (బాస్టన్, యు.యెస్.ఏ) నుంచి హరిని దర్భా, (ఇండియా) నుంచి మృదురవళి దర్భా, మరియు జయ పీసపాటి బృందం ( హాంకాంగ్ ) నుంచి హర్షిణీ పచ్చంటి, సుసర్ల సాయి జయంత్, నారాయణి గాయత్రి ఇయుణ్ణి, డా. సతీష్ కుమార్ పట్నాల, రోహన్ మార్కాపురం, ( యు.యెస్.ఏ)  నుంచి రోహిత్ విస్సంశెట్టి, ( తైవాన్ ) నుంచి డా. ఏకాంబర నెల్లూర్ ప్రకాష్, డా.సత్య చందు హరిసోమయాజుల, కన్నెగంటి వాసంతి దేవి పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి, చక్కటి వ్యాఖ్యానంతో వారిని స్మరించుకున్నారు.  


ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru వైబ్‌సైట్ చూడాలని కోరారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ghantasala100th@gmail.com అడ్రస్‌కు ఈ మెయిల్ పంపాలని సూచించారు.



Updated Date - 2022-08-24T05:15:15+05:30 IST