GHMC ఎర్లీ బర్డ్ బంపర్ హిట్.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా..
ABN , First Publish Date - 2022-04-30T12:18:27+05:30 IST
GHMC ఎర్లీ బర్డ్ బంపర్ హిట్.. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా..
- రికార్డు స్థాయిలో రూ.617 కోట్లు వసూలు
- నేడు మరో రూ.50-60 కోట్లు వచ్చే అవకాశం
హైదరాబాద్ సిటీ : జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీ బర్డ్ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. అధికారుల అంచనాలకు మించి ఒకే నెలలో రికార్డు స్థాయి ఆస్తి పన్ను వసూలైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ముందస్తుగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తూ ఏప్రిల్ 30ని చివరి తేదీగా సంస్థ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు సంస్థ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రూ.617కోట్లు వసూలయ్యాయని బల్దియా రెవెన్యూ విభాగం వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 18లక్షల మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఉండగా, 6.51లక్షల మంది చెల్లించారు.
నేడు ఎర్లీ బర్డ్ రాయితీకి ఆఖరి రోజు కాగా, శనివారం మరో రూ.50-60 కోట్లు పన్ను వసూలు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఎర్లీబర్డ్లో రూ.541 కోట్ల పన్ను వసూలు కాగా.. ఇప్పటికే రూ.76 కోట్లు అధిక ఆదాయం సమకూరింది. మొత్తంగా రూ.650-675 కోట్ల పన్ను వసూలవుతుందని భావిస్తున్నారు. మొదట రూ.600 కోట్ల పన్ను వసూలును జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కువ మొత్తం పన్ను చెల్లించే వారికి రాయితీ విషయం చెప్పి.. పన్ను వసూలు చేయాలని ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
రెండు రోజుల ముందే రూ.600 కోట్ల మార్క్ దాటడంతో.. లక్ష్యాన్ని రూ.700 కోట్లుగా సవరించారు. ఈ మేరకు చివరి రోజు పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు ఈ ఆదాయం భారీ ఉపశమనం కానుంది. రోడ్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి, ఇతరత్రా పెండింగ్ బిల్లుల చెల్లింపుపై దృష్టి సారించనున్నట్టు ఆర్థిక విభాగం వర్గాలు పేర్కొన్నాయి.