ఎంఐఎంకు తెరవెనక సాయం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవటంతో..

ABN , First Publish Date - 2020-12-06T16:20:37+05:30 IST

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారని

ఎంఐఎంకు తెరవెనక సాయం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోవటంతో..

హైదరాబాద్/ముషీరాబాద్‌ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌లో ఎంఐఎం అభ్యర్థి గౌసుద్దీన్‌కు స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు పరోక్షంగా సహకరించడం వల్లే.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారని అభ్యర్థి బింగి నవీన్‌ వర్గీయులు అంటున్నారు. ఈ డివిజన్‌లో మైనారిటీలు అధికంగా ఉండటంతో ఎంఐఎం పోటీ చేసింది. దీంతో పార్టీ అగ్రనేతలు ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకురావటంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరఫున ఏ ఒక్క అగ్రనాయకుడూ ప్రచారానికి రాలేదని బింగి వర్గీయుల ఆరోపణ. డివిజన్‌ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ను నియమించినప్పటికీ ఆయన ఒక్క రోజు కూడా ప్రచారానికి రాలేదని అంటున్నారు.


డివిజన్‌ అగ్రనాయకులు, టీఆర్‌ఎస్‌ మైనారిటీ నాయకులు బింగి నవీన్‌ వెంటే కనబడ్డప్పటికీ, వారు ఆయన గెలుపు కోసం ఏ మాత్రం  కృషి చేయలేదని కిందిస్థాయి నాయకులు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఎంఐఎంకు మద్దతు పలకగా, మరికొంత మంది కాంగ్రె్‌సకు పనిచేసినట్లు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీలు ఎలాగైనా డివిజన్‌ను కైవసం చేసుకోవాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా రోజూ బహిరంగ సభలు, పాదయాత్రలు నిర్వహించారు. వారిద్దరూ సుమారు 8 సభలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌కు మైనారిటీ మహిళలు అండగా నిలిచినప్పటికీ, యువత ఎంఐఎంకు మద్దతు పలకడంతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించినట్లు చెబుతున్నారు.

Updated Date - 2020-12-06T16:20:37+05:30 IST