పోరుకు ముందు ఏరులే..!
ABN , First Publish Date - 2020-11-29T06:45:44+05:30 IST
గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుండటంతో చి
ముందస్తుగా మద్యం నిల్వలు
చివరి రెండు రోజుల పాటు పంపిణీకి సన్నాహాలు
సైదాబాద్, నవంబర్ 28 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుండటంతో చివరి ఆవకాశంగా అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా మద్యం పంపిణీపై దృష్టి సారిస్తున్నారు. గతంలో బస్తీలు, మురికివాడలలోనే మద్యం పంపిణీ జరిపేవారమని, ఈ ఎన్నికలల్లో పలు కాలనీవాసులు, అపార్ట్మెంట్ వాసులు సైతం డిమాండ్ చేస్తున్నట్లు అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎకై్ౖసజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్ని పార్టీలు ముందుగానే మద్యం బాటిళ్లను రహస్యంగా నిల్వ ఉంచాయి.
చీప్ లిక్కర్ తీసుకోం...
తాము తక్కువలో దొరికే చీప్ లిక్కర్ తీసుకోమని, బ్రాండ్ మద్యం కావాలని కొందరు నాయకుల మొహం మీదే చెబుతున్నారట. అవి ఇస్తేనే ఓటు వేస్తామంటూ డిమాండ్ చేస్తున్నారట. చేసేదేమీ లేక కొందరు అభ్యర్థులు వారు అడిగిన బ్రాండెడ్ మద్యాన్ని అందజేస్తున్నారు.
ఓటర్ల చెంతకు...
పోలింగ్ తేదీకి గడువు సమీపిస్తుండడంతో ఓటర్ల చెంతకు మద్యం చేర్చేందుకు కొందరు అభ్యర్థులు రంగం సిద్ధం చేశారు. తమ అనుచరుల ద్వారా నేరుగా ఇంటింటికీ మద్యం బాటిళ్లు అందజేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో కొందరు యువకులు కీలక పాత్ర వహిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి ఆయా వార్డులలో బైక్లపై మద్యం తరలిస్తున్నట్లుగా సమాచారం.