GHMC సిబ్బందిపై షోరూమ్ నిర్వాహకుల దురుసు ప్రవర్తన..
ABN , First Publish Date - 2022-02-22T19:07:28+05:30 IST
ఆస్తిపన్ను వసూలు కోసం వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్ నిర్వాహకులు, సిబ్బంది దురుసుగా ...
- ఆస్తిపన్ను వసూలు కోసం వెళ్తే..
హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట : ఆస్తిపన్ను వసూలు కోసం వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్ నిర్వాహకులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తించి వారితో గొడవకు దిగారు. చివరకు ఆస్తిపన్ను బకాయిలను చెక్కు ద్వారా చెల్లించారు. పంజాగుట్ట ప్రధాన రహదారిలోగల ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్ రూ.32 లక్షల ఆస్తిపన్ను బకాయి పడింది. వసూలు కోసం జీహెచ్ఎంసీ అధికారులు నోటీసు జారీ చేశారు. బకాయి అడిగేందుకు బిల్ కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది సోమవారం షోరూమ్కి వెళ్లగా నిర్వాహకులు, సిబ్బంది వారితో దురుసుగా ప్రవర్తించి, లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, షోరూమ్ నిర్వాహకులతో చర్చించారు. ఈ క్రమంలో షోరూమ్ నిర్వాహకులు రూ.32 లక్షలకు చెక్కు ఇచ్చారు. సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, సకాలంలో పన్ను చెల్లించాలని, గడువు దాటితే ఆయా ఆస్తులను జప్తు చేస్తామని ఖైరతాబాద్ సర్కిల్ డీఎంసీ వంశీకృష్ణ తెలిపారు. సనత్నగర్లో ఓ పారిశ్రామిక సంస్థ రూ.6 కోట్ల ఆస్తిపన్ను బకాయి ఉందని, వారికి నోటీసులు జారీ చేస్తామని డీఎంసీ చెప్పారు.