Texas School Massacre: సంకటంలో సమయస్ఫూర్తి.. భళా బాలిక!
ABN , First Publish Date - 2022-05-28T12:43:05+05:30 IST
ఆపద పొంచి ఉన్న సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చునని నిరూపించిందో విద్యార్థిని!
రక్తాన్ని పూసుకొని.. చచ్చినట్లుగా నాటకమాడి..
టెక్సాస్ ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న బాలిక
టెక్సాస్, మే 27: ఆపద పొంచి ఉన్న సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చునని నిరూపించిందో విద్యార్థిని! అమెరికాలోని టెక్సాస్ స్కూల్లో ఓ 18 ఏళ్ల యువకుడు, బడిలోకి ప్రవేశించి కాల్పులు జరపడంతో 19 మంది పిల్లలు ప్రాణాలు విడిచిన విషాదం తెలిసిందే కదా! అయితే దుండగుడు కాల్పులు జరుపుతున్నప్పుడు 14 ఏళ్ల విద్యార్థిని మియాహ్ సెరిల్లో గొప్ప సమయస్ఫూర్తితో అతడిని తప్పుదోవ పట్టించి ప్రాణాలు దక్కించుకుంది. కాల్పులకు బెదిరిపోకుండా పక్కన రక్తపు మడుగులో అచేతనంగా పడివున్న స్నేహితుల మీద నుంచి రక్తాన్ని శరీరమ్మీద పూసుకుంది. ఆపై తాను చచ్చిపోయినట్లుగా అచేతనంగా ఉండిపోయింది. అయితే దారుణాన్ని కళ్లారా చూసిన ఆ బాలిక, ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతోందని ఆమె పిన్ని తెలిపారు.