ప్రేమ పేరుతో వల... ఢిల్లీకి తీసుకెళ్లి వంచన.. తరువాత ఆమె పరిస్థితి ఏమయ్యిందంటే..

ABN , First Publish Date - 2022-08-07T18:05:48+05:30 IST

బీహార్‌లోని పూర్నియాలో ఓ సంచలన ఉదంతం...

ప్రేమ పేరుతో వల... ఢిల్లీకి తీసుకెళ్లి వంచన.. తరువాత ఆమె పరిస్థితి ఏమయ్యిందంటే..

బీహార్‌లోని పూర్నియాలో ఓ సంచలన ఉదంతం వెలుగు చూసింది. ఒక యువకునితో పాటు అతని కుటుంబసభ్యులు ఒక బాలికను చంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కతిహార్ జిల్లా టెల్టా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బలుగంజ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పూర్నియా పరిధిలోని ఒక గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో ఇక్బాల్ అనే యువకుడు తనతో పాటు తీసుకువెళ్లిపోయాడు. తరువాత ఆ యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ బాలికను హత్య చేసి, మృతదేహానికి ఉరివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం కుమ్హర్వాకు చెందిన ఇక్బాల్ తన సోదరిని ప్రేమ ఉచ్చులో బిగించాడని మృతురాలి సోదరుడు, తల్లి ఆరోపిస్తున్నారు. 


బాలూగంజ్‌లో నిందితులు బాలికను హత్య చేసి, ఉరివేసినట్లు సమాచారం. స్థానికంగా కలకలం చెలరేగడంతో ఇక్బాల్, అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక్బాల్‌కు ఇప్పటికే వివాహమైందని మృతురాలి కుటుంబీకులు తెలిపారు. అతను ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు చేస్తుంటాడని, అందుకోసం గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. రెండు నెలల క్రితం ఆమెను కిడ్నాప్ చేశాడు. అతను మొదట అమ్మాయిని ఢిల్లీకి తీసుకెళ్లాడు, తరువాత ఢిల్లీ నుండి తిరిగి వచ్చి తన ఇంట్లో ఆమెను ఉంచాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు 6 మందిపై టెల్టా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2022-08-07T18:05:48+05:30 IST