ఇంజరి, జామిగుడ ప్రజలకు పథకాలు ఇవ్వండి
ABN , First Publish Date - 2022-08-19T06:38:38+05:30 IST
పెదబయలు మండలంలోని మారుమూల ఇంజరి, జామిగుడ పంచాయతీల ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు విమర్శించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజారావు
పాడేరురూరల్, ఆగస్టు 18: పెదబయలు మండలంలోని మారుమూల ఇంజరి, జామిగుడ పంచాయతీల ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు విమర్శించారు. గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇంజరి, జామిగుడ పంచాయతీల ప్రజల జీవనం దుర్భరంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోపోవడం విచారకరమన్నారు. ఇంజరి పంచాయతీ జమాదంగిలో ఈనెల 2వ తేదీన పిడుగు పడి వంతాల సన్యాసిరావు(43)తో పాటు 54 పశువులు, ఏడు మేకలు మృతి చెందినా అధికారులు ఎవరూ నేటి వరకు ఆ గ్రామాన్ని సందర్శించలేదన్నారు. గిరిజన ప్రజలపై ఈ ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎంత మక్కువో స్పష్టమవుతుందన్నారు. జామిగుడ ఎంపీపీ స్కూల్లో 60 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, అక్కడ విద్యా బోధనకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. వారు కూడా నెలలో ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడ మఽధ్యాహ్నా భోజన పథకం అమలు కావడం లేదన్నారు. రూ. 18 లక్షలతో చేపట్టిన నాడు-నేడు పనులు సక్రమంగా జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సల్లా రామకృష్ణ, కూడా కృష్ణారావు, పాంగి మత్స్యకొండబాబు, పాంగి రామయ్య, చిన్నయ్య, బాబూరావు పాల్గొన్నారు.