వైభవంగా జ్యోతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-04-18T04:53:35+05:30 IST

మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా జ్యోతి ఉత్సవం శనివారం జరి గింది.

వైభవంగా జ్యోతి ఉత్సవాలు

 బన గానపల్లె, ఏప్రిల్‌ 17: మండలంలోని నందవరం  చౌడేశ్వరీమాత ఉగాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా జ్యోతి ఉత్సవం శనివారం జరి గింది. ఈ కార్యక్రమానికి   తెలుగు రాష్ట్రాల నుంచేగాక  కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో నందవరం కిటకిటలాడింది. శుక్రవారం అర్ధరాత్రి 1 గంటకు భాస్కరయ్య ఆచారి నందవరం శీ చౌడేశ్వరీ అమ్మవారికి దిష్టిచుక్క పెట్టిన అనంతరం జ్యోతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.  బాణాసంచా, డప్పువాయిద్యాల మధ్య నందవరం గ్రామ నడిబొడ్డున ఉన్న చెన్నకేశవస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన జ్యోతి ఉత్సవం గ్రామ వీధుల గుండా అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా సాగింది. తర్వాత 400కు పైగా  జ్యోతులను చౌడేశ్వరీదేవికి నివేదినగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అగ్నిగుండంలోకి ప్రవేశించి, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.  


భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్‌ పీఆర్‌. వెంకటేశ్వరరెడ్డి, ఆలయ ఈవో రామానుజన్‌, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చలువపందిళ్లు, ప్రత్యేక దర్శనాలు,  తాగునీటి వసతి కల్పించారు.   అమ్మవారి నిత్యాన్నదాన సత్రంలో మూడు రోజుల నుంచి భోజన వసతి కల్పించారు.   పాణ్యం సీఐ జీవనగంగాధర్‌బాబు, నందివర్గం ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి, నంద్యాల, గడివేముల సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బనగానపల్లె ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు.  


ఘనంగా అమ్మవారి రథోత్సవం :
ఉత్సవంలో భాగంగా శనివారం  సాయంత్రం 4 గంటలకు చౌడేశ్వరీదేవి రథోత్సవం అంగరంగ ఘనంగా నిర్వహించారు. ఆలయం నుంచి  అమ్మవారి ఉత్సవ విగ్రహాలను  రథంపై  ఊరివాకిలి వద్దకు లాగారు.  

Updated Date - 2021-04-18T04:53:35+05:30 IST