ఘనంగా ఐఐపీఈ మొదటి స్నాతకోత్సవం
ABN , First Publish Date - 2022-01-22T06:45:25+05:30 IST
విశాఖపట్నం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. సిరిపురం వద్ద గల వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించారు
ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి
ఆరుగురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్
విశాఖపట్నం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): : విశాఖపట్నం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. సిరిపురం వద్ద గల వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించారు. 2045 నాటికి భారతదేశం ఇంధన డిమాండ్ రేటు 3 శాతం పెరుగుతుందని, అదే సమయంలో పలు దేశాలలో ఇంధన డిమాండ్ రేటు ఒక శాతం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం పెట్రోలియం రంగంలో నైపుణ్యత కలిగిన మానవ వనరులను అభివృద్ధిపరచుకోవాలని సూచించారు. తాను ప్రారంభించిన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి మాట్లాడుతూ ఐఐపీఈ విద్యార్థులు అత్యుత్తమ స్థాయిలో పరిశోధనలు సాగించాలని ఆకాంక్షించారు. పెట్రోలియం రంగంలో విన్నూతమైన ఆవిష్కరణలకు అవసరమైన తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు, ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ పీకే బానిక్, ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ఆర్కే ప్రసాద్, వివిధ విశ్వ విద్యాలయాల ఉపకులపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గోల్డ్ మెడల్స్ ప్రదానం
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు స్నాతకోత్సవ వేదికగా గోల్డ్ మెడల్స్ను ప్రదానం చేశారు. 2016-20 బ్యాచ్లో అత్యధిక సీజీపీఏ సాధించిన పెట్రోలియం ఇంజనీరింగ్ విద్యార్థి కండల విశ్వకాంత్, కెమికల్ విద్యార్థి భమిడిపాటి సాయి హర్ష, అకడమిక్స్ ఎక్స్లెన్స్, అదర్ యాక్టివిటీస్ విభాగంలో వైభవ్ శర్మలకు మెడల్స్ బహూకరించారు. అలాగే, 2017-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అత్యధిక సీజీపీఏ సాధించిన పెట్రోలియం విద్యార్థి దంగేటి శ్రీకార్తీక్, కెమికల్ విద్యార్థి అభినవ్ తివారీ, ఆల్ రౌండర్ విభాగంలో కోనల రేష్మా రెడ్డి గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.