మాధురి సౌందర్య రహస్యం...
ABN , First Publish Date - 2020-11-30T05:30:00+05:30 IST
యాభై మూడేళ్ల వయసులోనూ కాంతులీనే చర్మం మాధురి దీక్షిత్ సొంతం. వయసుతో పాటు అందాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఆమె తన చర్మ సౌందర్య రహస్యాన్ని ఈమధ్యే వివరించారు...
యాభై మూడేళ్ల వయసులోనూ కాంతులీనే చర్మం మాధురి దీక్షిత్ సొంతం. వయసుతో పాటు అందాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఆమె తన చర్మ సౌందర్య రహస్యాన్ని ఈమధ్యే వివరించారు. ఆరోగ్యవంతమైన, కాంతిమంతమైన చర్మం కోసం ఏం చేయాలి! ఏం చేయకూడదు? అని సలహాలిచ్చారు. ఆమె ఏం చెప్పారంటే...
‘‘కాంతిమంతమైన చర్మం సొంతం కావాలంటే అంతర, బాహ్య జాగ్రత్తలు తప్పనిసరి. అంతర జాగ్రత్తల విషయానికొస్తే... రోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం మానెయ్యాలి. తాజా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినాలి. అయితే పండ్ల రసం తాగడం కన్నా నేరుగా పండ్లను తినడం మంచిది. అలానే నిద్రవేళలు కచ్చితంగా పాటించాలి. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. వీటితో పాటు వ్యాయామం చేయాల్సిందే. ఇవన్నీ చేస్తే చర్మం మెరుపులీనుతుంది. మరిన్ని జాగ్రత్తలు ఏమిటంటే... రాత్రిపూట ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాతే నిద్రపోవాలి. ఎందుకంటే మేకప్, దుమ్ము ముఖం మీది చర్మరంధ్రాలను మూసి వేస్తాయి. అలానే ఆల్కహాల్ లేని టోనర్ ఉపయోగించాలి. రోజ్ వాటర్ వాడాలి. అలానే చర్మాన్ని మెరిపించే విటమిన్ సి సీరమ్ వాడాలి. చివరగా చర్మతత్వాన్ని బట్టి తగిన మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఉదయాన్నే ముఖం శుభ్రం చేసుకొని సన్స్ర్కీన్ రాసుకోవాలి’’.