OBC కోటా వివాదం: MP Supriya Suleపై BJP chief అనుచిత వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-26T18:21:32+05:30 IST

మీరు రాజకీయాల్లో ఎందుకు ఉన్నారు? ఇంటికి వెళ్లి చక్కగా వంట చేసుకోండి. రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిని ఎలా కలవాలో తెలీదా? మీరు కూడా ఢిల్లీకి వెళ్లండి లేదా నరకానికి వెళ్లండి లేదా ఎక్కడైనా వెళ్లండి కానీ ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి తీసుకురండి..

OBC కోటా వివాదం: MP Supriya Suleపై BJP chief అనుచిత వ్యాఖ్యలు

ముంబై: మహారాష్ట్రలో ఓబీసీ కోటా(OBC quota) వివాదం రాజకీయ పార్టీల మధ్య తీవ్ర వివాదంగా మారింది. భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(Nationalist Congress Party)ల మధ్య అనుచిత వ్యాఖ్యలకు దారి తీసింది. కాగా, ఈ వివాదం నేపథ్యంలో ఎన్సీపీ నేత, ఎంపీ సుప్రియ సూలెపై మహారాష్ట్ర బీజేపీ అధినేత చంద్రకాంత్ పాటిల్(Chandrakant Patil) అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోపో’’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, చంద్రకాంత్ వ్యాఖ్యలపై నెటిజెన్లు బీజేపీయేతర పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.


మహారాష్ట్రలోని ఓబీసీలకు సైతం విద్యా, ఉద్యోగాల్లో కోటా అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర బీజేపీ యూనిట్ నిరసన చేస్తోంది. అయితే మహారాష్ట్రలో కొనసాగుతోన్న ఈ నిరసనను మధ్యప్రదేశ్‌తో పోల్చారు సుప్రియ సూలె. ఈ నేపథ్యలో రాష్ట్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘‘మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి ఎవరినో కలిసి వచ్చారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు కసరత్తు ప్రారంభమైంది’’ అని అన్నారు. కాగా, దీనిపై చంద్రకాంత్ ఘాటుగా స్పందించారు. ‘‘మీరు రాజకీయాల్లో ఎందుకు ఉన్నారు? ఇంటికి వెళ్లి చక్కగా వంట చేసుకోండి. రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిని ఎలా కలవాలో తెలీదా? మీరు కూడా ఢిల్లీకి వెళ్లండి లేదా నరకానికి వెళ్లండి లేదా ఎక్కడైనా వెళ్లండి కానీ ఓబీసీ రిజర్వేషన్లు అమలులోకి తీసుకురండి’’ అని అన్నారు.


మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఓబీసీ కోటా అంశాన్ని సుప్రీంలో ఉంచి అన్యాయం చేస్తోందని ఆరోపించింది. కాగా, కేంద్ర ప్రభుత్వమే ఓబీసీ కోటాను అమలు కాకుండా అడ్డుకుంటోందని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సరైన డేటా ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని, ఓబీసీ కోటాకు బీజేపీనే అడ్డంకని విమర్శలు గుప్పించింది. ఇక సుప్రియపై చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికే అవమానమని ఆమె భర్త సదానంద సూలె అభిప్రాయపడ్డారు. భార్యగా, తల్లిగా, విజయవంతమైన రాజకీయవేత్తగా సుప్రియ నెంబర్‌వన్‌గా ఉన్నారని, దేశంలోని అత్యంత తెలివైన నాయకుల్లో సుప్రియ ఒకరని, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

Updated Date - 2022-05-26T18:21:32+05:30 IST