Sonali Phogat Murder: సీబీఐకి అప్పగించాలని సీఎం సిఫారసు

ABN , First Publish Date - 2022-09-12T22:17:53+05:30 IST

సంచలనం సృష్టించిన సోనాలి ఫోగట్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి..

Sonali Phogat Murder: సీబీఐకి అప్పగించాలని సీఎం సిఫారసు

పనజి: సంచలనం సృష్టించిన సోనాలి ఫోగట్ (Sonali phogat) మృతి కేసును సీబీఐ (CBI)కి అప్పగించాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ లేఖ రాయనున్నట్టు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod sawant) తెలిపారు. హర్యానాలోని హిసార్‌కు చెందిన బీజేపీ నేత ఫోగట్ గత నెలలో గోవాలో మృతి చెందగా, పోస్ట్‌మార్టం అనంతరం గోవా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.


''గోవా పోలీసులు ఈ కేసు విచారణలో చాలా చక్కగా పనిచేశారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. కానీ, హర్యానా ప్రజలు, సోనాలి ఫోగట్ కుమార్తె కోరిక మేరకు ఈ కేసును సిబీఐకి అప్పగించాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నాం'' అని సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు ఫోగట్ సహాయకులతో సహా ఐదుగురిని గోవా పోలీసులు అరెస్టు చేశారని, ఫోగట్ అనుచరులు ఇద్దరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారని చెప్పారు.


హర్యానా సీఎంకు అల్టిమేటం...

కాగా, సోనాలి ఫోగట్ హత్య కేసును సెప్టెంబర్ 23 కల్లా సీబీఐకి అప్పగించాలంటూ హర్యానా ముఖ్యమంత్రికి ''సర్వ్ జాతీయ ఖాప్ మహాపంచాయత్'' అదివారంనాడు అల్టిమేటం ఇచ్చింది. అలా కాని పక్షంలో సామూహిక ఆందోళనలు ప్రారంభిస్తామని హెచ్చరించింది. ఫోగత్ కుమార్తె యశోధర, కుటుంబ సభ్యులు కూడా ఈ మహాపంచాయత్‌లో పాల్గొన్నారు. ''నా తల్లికి న్యాయం జరగాలి. ఈ విషయంలో నాకు మద్దతు ఇవ్వండి'' అని యశోధర చేతులు జోడించి మరీ మహాపంచాయత్‌లో కోరారు. సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మహాపంచాయత్‌లో పాల్గొన్న అందరూ చేతులు పైకెత్తి ఆమెకు మద్దతు ప్రకటించారు.

Updated Date - 2022-09-12T22:17:53+05:30 IST