డెడ్ స్టోరేజీ...సాధ్యమెలా?
ABN , First Publish Date - 2022-05-17T06:54:21+05:30 IST
అఖండ గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి డెడ్ స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచడానికని రూ.272 కోట్ల అంచనాతో కోటి 80 లక్షల యూనిట్ల మేర ఇసుకను డ్రెడ్జింగ్ చేయ
గోదావరిలో డెడ్ స్టోరేజీకి రూ.272 కోట్లతో డ్రెడ్జింగ్
బ్యారేజీ స్టోరేజీ కెపాసిటీ 3.183 టీఎంసీలు మాత్రమే
అదనంగా స్టోరేజీని ఎలా పెంచుతారో మరి
మూడు నెలలు అవుతున్నా.. ఖరారు కాని టెండర్లు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
అఖండ గోదావరిలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి డెడ్ స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచడానికని రూ.272 కోట్ల అంచనాతో కోటి 80 లక్షల యూనిట్ల మేర ఇసుకను డ్రెడ్జింగ్ చేయడం కోసం ప్ర భుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నిర్ణయం గతంలోనే తీసుకున్నప్పటికీ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద డెడ్ స్టోరేజీని పెంచడం కోసమంటూ ఒక నిర్ణయం తీసుకుంది. కానీ మూడు నెలల కిందటే టెండర్లు పిలిచింది. టెండర్లు ఓపెన్ చేశారు. ముగ్గురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఒకరు యూనిట్ ఇసుక డ్రెడ్జింగ్ చేసి, ఒడ్డున వేయడానికి రూ.155కు టెండరు వేసినట్టు సమాచారం. కానీ అధికారులు ఈ టెం డర్లను ఖరారు చేయడం లేదు. చాలారోజుల నుంచి పెండింగ్లో పెట్టారు. ఇంకా టెండర్ ప్రక్రి య జరుగుతుందని చెబుతున్నారు. ఈ వేసవికాలం అయిపోయిన తర్వాత, వానా కాలంలో డ్రెడ్జింగ్ చేస్తే ప్రయోజనం ఉంటుందో లేదో అధికారులు తేల్చాలి. ఈ టెండర్ల సంగతి ఇలా ఉండగా, గోదావరి డెడ్ స్టోరేజీని పెంచేవిషయంలో నిపుణులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ స్టోరేజి కెపాసిటీ 3.183 టీఎంసీలు. ఎక్కువ నీరు వస్తే ఎంతవరకూ ఉం టుంది, దీనిని ఎలా పెంచుతారనేది ప్రశ్న. ఇసుక మేటలు తీయడం వల్ల, ఇసుక ఎంత తీశారో అంత సామర్థ్యం పెరుగుతుందా? అనేది ఒక సందేహం. నిజానికి ఒకచోట ఇసుక తీసినా మరొక చోట నుంచి ఇసుక వచ్చేస్తుంది.
ఇప్పటికే అఖండగోదావరి నుంచి ఏళ్ల తరబడి లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేస్తున్నారు. డీసిల్టేషన్ పేరిట తవ్వుతున్నారు. గతంలో డ్రెడ్జింగ్ కూడా చేశారు. ఇంజన్ పడవలతో ఇప్పటికీ తీస్తున్నారు. కానీ డ్రెడ్జింగ్ పేరిట లంక లు తొలగిస్తే స్టోరేజీ మాటెలా ఉన్నా, ప్రవాహ వేగం పెరుగుతుందనే వాదన ఉంది. ఈ వేగం వల్ల కాలువలకు మరింత వేగంగా నీటి ప్రవాహం ఉండవచ్చనే అంచనా ఉంది. కానీ స్టోరేజీ సామర్థ్యం పెద్దగా పెరిగే అవకాశం లేదనే వాదన ఉంది. సామర్థ్యం పెంచినా బ్యారేజీ స్టోరేజి సామర్థ్యాన్ని మించి నిల్వ ఉంచలేరు. వాస్తవానికి ఇసుక మేటలు తీయడం మంచిదే. కానీ ఇక్కడ కేవ లం ఇసుక వ్యాపారం కోసమే డెడ్జింగ్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు ప్రచా రం జరుగుతోంది. ఇప్పటికే అఖండగోదావరిలో జేపీ సంస్థ ఇసుక తీస్తోంది. దానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ డ్రెడ్జింగ్ వల్ల డ్రెడ్జింగ్ చేసేవారికి ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి. తర్వాత దానిని అమ్ముకోవాలి. ప్రస్తుతం రూ.272 కోట్లతో ఒక కోటి 80 లక్షల యూనిట్ల ఇసుక తీయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. బ్యారేజీకి ముందు ఉన్న లంకలు ఉండడం వల్ల బ్యారేజీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల ఇసుక కోసమే అయితే బ్యారేజీకి దూరంగా మేటలు తీయాలి.
కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత...
పోలవరం వద్ద ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల అక్కడ కొంత నీరు ఉంది. స్టోరేజీకంటే ఎక్కువ ఇన్ఫ్లోస్ ఉంటే, స్పిల్వే గుండా కిందకు పంపిస్తున్నారు. ప్రస్తుతం కాలువలు కట్టేయడం వల్ల అదం తా సముద్రంలోకి పోతోంది. ఇక్కడ కాఫర్ డ్యామ్ వల్ల కొంతనీరు నిల్వ ఉండడం వల్ల ఈ ఏడాది ఇవాల్టికీ బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీరు పోతోంది. రబీకి కూడా ఇబ్బంది లేకుండా పోయింది. అందువల్ల ఇవాళ ఇసుక మేటలు తొలగించి, డెడ్ స్టోరేజీని పెంచినా... స్పిల్వే నుంచి నిత్యం వచ్చే నీటిని నిల్వ చేయగలిగితేనే డ్రెడ్జింగ్ అవసరం. కానీ చిత్తశుద్ధితో పనిచేయాలి. టెండర్ల ప్రక్రియ మొదలైన మూడు నెలలైనా... టెండర్లు తెరిచినప్పటికీ వాటిని ఖరారు చేయడం లేదు. సుమారు మూడు సంస్థలు టెండర్లు దాఖలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఎందుకో అధికారులు నోరుమెదపడంలేదు.
నీటిమట్టాలిలా..
ప్రస్తుతం బ్యారేజీ స్టోరేజీ 2.77 టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం 11 అడుగులుగా ఉంటే స్టోరేజీ 3.184 టీఎంసీలుగా ఉం టుంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 8.85 అడుగులుగా ఉంది. సముద్రంలోకి 4200 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. మొత్తానికి డ్రెడ్జిం గ్ ఇసుక కోసమే చేస్తున్నారని, పైగా డెడ్ స్టోరేజీ పెంచడానికంటూ ప్రభు త్వం పక్కదోవ పట్టిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.