floods: గ్రామాల్లోకి పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2022-08-14T02:01:27+05:30 IST

గోదావరి వరద (Godavari flood) పోటెత్తి గ్రామాలను ముంచెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక లంక గ్రామాల చుట్టూ వరదనీరు చేరడంతో పాటు

floods: గ్రామాల్లోకి పోటెత్తిన వరద

అమలాపురం: గోదావరి వరద (Godavari flood) పోటెత్తి గ్రామాలను ముంచెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక లంక గ్రామాల చుట్టూ వరదనీరు చేరడంతో పాటు ప్రధాన రహదారులన్నీ మునిగిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వరదనీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతుంది. సముద్రంలోకి పెద్దగా  దిగకపోవడంతో ఈపరిస్థితి నెలకొంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Ambedkar Konaseema District)లోని సుమారు 40కుపైగా లంక గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. కాజ్‌వేలన్నీ నీట మునిగాయి. అప్పనపల్లి, కనకాయలంక, ఎదురుబిడియం, కె.ఏనుగుపల్లి, అప్పనరామునిలంక కాజ్‌వేలు నీట మునగడంతో ప్రయాణాలు స్తంభించాయి. కోటిపల్లి, నర్సాపురం రేవుల్లో పంట్ల రాకపోకలు నిలిపివేశారు. అయినవిల్లి, పి.గన్నవరం మండలాల్లో 67మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముందుగా మోహరించాయి. అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం చుట్టూ వరదనీరు రావడంతో దర్శనాలు నిలిపివేశారు. ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముమ్మిడివరం మండలంలోని పలు లంక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించింది. గురజాపులంక, గేదెల్లంక, చింతపల్లిలంకలతో సహా అనేక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించింది. గ్రామాల్లోకి వెళ్లే  ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల నుంచి వరద పోటెత్తడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అల్లవరం మండలం పల్లిపాలెంలో మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి. కాట్రేనికోన మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 25ఇళ్లు నీట మునిగాయి. 

Updated Date - 2022-08-14T02:01:27+05:30 IST