Andhra Pradesh: ప్రమాదకరంగా మారిన గోదావరి

ABN , First Publish Date - 2022-07-15T01:51:15+05:30 IST

గోదావరి (Godavari) వరద ప్రమాకరంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దిశగా

Andhra Pradesh: ప్రమాదకరంగా మారిన గోదావరి

రాజమహేంద్రవరం: గోదావరి (Godavari) వరద ప్రమాకరంగా మారింది. ధవళేశ్వరం బ్యారేజీ (Dowleswaram Barrage) వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 16,61,187 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నీటిమట్టం  16.10 అడుగులుగా ఉంది.  నీటిమట్టం 17 అడుగులకు చేరి బ్యారేజీ నుంచి 17 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేస్తే మూడో ప్రమాద హెచ్చరిక  జారీ చేస్తారు.  పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 34.84 మీటర్లుగా ఉంది. స్పిల్‌వే నుంచి  16,16,830 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో  నీటిమట్టం 62.20 అడుగులకు చేరింది. ఇక్కడ నుంచి 19,29,553  క్యూసెక్కులు విడుదల చేశారు. తెలంగాణ ప్రాంతంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నీటిమట్టం 16.750 మీటర్లుగా ఉంది. అక్కడ నుంచి ఏకంగా 28,46,140 క్యూసెక్కులు భద్రాచలం వైపు వస్తుంది. 


కాళేశ్వరం నుంచి భద్రాచలం ఈ వరద రావడానికి 25 నుంచి 30 గంటలు పడుతుందని అధికారులు అంచనా వేశారు.  భద్రాచలం నుంచి ధవళేశ్వరం రావడానికి  15 నుంచి 18 గంటలు పడుతుందని అంచనా. ఇక ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వెళ్లడానికి సాధారణంగా 12 గంటలు పడుతుంది. గోదావరి లంకలను ముంచుకుంటూ ప్రవహించడం వల్ల మరింత సమయం పట్టవచ్చు. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే ఆరు జిల్లాలు అంటే తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామరాజు,  పశ్చిమగోదావరి , ఏలూరు జిల్లాల్లోని 42 మండలాలు.. 524 గ్రామాలు ముంపునకు గురవుతాయని  రాష్ట్ర విపత్తుల శాఖ ప్రకటించింది. 

Updated Date - 2022-07-15T01:51:15+05:30 IST