గోదారోళ్ల ఆతిథ్యమా?.. మజాకా?
ABN , First Publish Date - 2022-01-17T08:14:26+05:30 IST
గోదారోళ్ల ఆతిథ్యమా?.. మజాకా?
అల్లుళ్లకు 365 రుచులు
విభిన్న వంటలతో సంక్రాంతి విందు
కొసరికొసరి వడ్డించిన అత్తమామలు
నరసాపురం/ఆలమూరు, జనవరి 16: మర్యాదలకు పుట్టినిళ్లు గోదావరి జిల్లాలు. ఈ జిల్లాల్లో అతిఽథులకు ఇచ్చే ఆతిథ్యం మరువలేనిది. సంక్రాంతి పండుగ పిండివంటల గురించి ఇక చెప్పనక్కర్లేదు. కొత్త అల్లుళ్లకు అన్ని రకాల వంటలు, మర్యాదలతో ముంచెత్తుతారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కొత్త అల్లుళ్లకు 365 రకాల వంటకాల రుచి చూపించారు. స్టీమర్రోడ్డులోని మన్నే నాగేశ్వరరావు, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె యశోదసాయికి మూడు నెలల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన వినయ్కుమార్తో వివాహమైంది. పండుగకు అల్లుడిని పిలిచి 365 రకాలతో విందు ఏర్పాటుచేశారు. అల్లుడి వెంటవచ్చిన బంఽధువులకూ కొసరి కొసరి వడ్డించి తినిపించారు. వీటిలో 40 రకాల నాన్ వెజ్, 140 రకాల పిండి వంటలు, 30 రకాల ఐస్క్రీమ్లు, 35 రకాల బిస్కెట్లు, 25 రకాల పండ్లు, 30 రకాల వెజిటేరియన్ కూరలు, అన్నం, బిర్యానీ, దద్ద్యోజనం తదితరాలు ఉన్నాయి. ఇదే పట్టణానికి చెందిన అత్యం మాధవి, వెంకటేశ్వరావు దంపతుల కుమార్తె కుందవికి ఇటీవల తణుకు పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ సాయికృష్ణతో నిశ్చితార్థం జరిగింది. సంక్రాంతి సందర్భంగా కాబోయే అల్లుడిని ఇంటికి పిలిచించి 365 రకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. వీటిలో అన్నం, పులిహోర తదితరాలతోపాటు 30 రకాల కూరలు, 100 రకాల స్వీట్లు, 70 రకాల పిండి వంటలు, 19 రకాల హాట్, 19 రకాల ఐస్క్రీమ్లు, 35 రకాల కూల్డ్రింక్స్, 15 రకాల కేక్లు ఉన్నాయి.
అరిటాకులో 20 మందికి భోజనం
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక శివారు గాంధీనగరంలో సంక్రాంతి సందర్భంగా 30 కుటుంబాలు కలిశాయి. పండుగను మూడు రోజులూ వేడుకగా జరుపుకున్నాయి. ప్రత్తి సత్యనారాయణ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో అతి పెద్ద అరిటాకును తయారుచేసి 20 మంది సహపంక్తి భోజనం చేశారు.