పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
ABN , First Publish Date - 2022-07-09T02:03:31+05:30 IST
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు, కొండ వాగుల జలాలతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది.
పోలవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు, కొండ వాగుల జలాలతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయానికి ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద 17.097 మీటర్లుగా నమోదైన నీటిమట్టం సాయంత్రానికి 17.497 మీటర్లకు చేరింది. స్పిల్వే, కాపర్ డ్యామ్ల వద్ద ఎగువన 27.135, దిగువన 15.555 మీటర్లుగా ఉన్న నీటిమట్టం స్పిల్వే, ఎగువ కాప డ్యామ్కు ఎగువున 28.0 మీటర్లు, దిగువన 17.4 మీటర్లకు చేరుకుంది. గోదావరిలోకి వస్తున్న 1.20 లక్షల అదనపు గోదావరి వరద జలాలను దిగువకు విడుదల చేసినట్లు ఈఈ ఆదిరెడ్డి తెలిపారు. వరద జలాలు పెరిగిపోవడంతో స్పిల్ వే ఎగువన ఆప్రోచ్ ఛానల్ కోసం జరిపిన తవ్వకాల ఛానల్ పూర్తిగా మునిగి స్పిల్ వే వైపు వరద జలాలు ఉరకలు వేస్తూ ప్రవహిస్తున్నాయి. పట్టిసీమ శివక్షేత్రం వద్ద వరద జలాలు ఇసుక తిన్నెలను పూర్తిగా ముంచెత్తాయి.