గాంధీ రాజ్యంలో గాడ్సేలకు చోటులేదు

ABN , First Publish Date - 2022-10-05T04:30:42+05:30 IST

అహింసకు మారుపేరైన గాంధీని రాక్షసుడి అవతారంగా మార్చడం సరికాదని, కలకత్తాలో ఇటీవల మహాత్ముడికి జరిగిన అవమానాన్ని సిద్దిపేట ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు ఖండించారు

గాంధీ రాజ్యంలో గాడ్సేలకు చోటులేదు
సిద్దిపేటలోని గాంధీచౌక్‌ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు

సిద్దిపేట ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు  

సిద్దిపేట అగ్రికల్చర్‌, అక్టోబరు4: అహింసకు మారుపేరైన గాంధీని రాక్షసుడి అవతారంగా మార్చడం సరికాదని, కలకత్తాలో ఇటీవల మహాత్ముడికి జరిగిన అవమానాన్ని సిద్దిపేట ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు ఖండించారు. గాంధీ రాజ్యంలో గాడ్సేలకు చోటు లేదని నినదించారు. గాంధీపై వ్యతిరేక వైఖరితో గాడ్సేను పూజించే సంస్థలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గాంధీని అవమానించి, గాడ్సేకు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న సంఘ వ్యతిరేక శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ గంప రాంచందర్‌రావు, గంప శ్రీనివాస్‌, ఐతా రత్నాకర్‌, పోశెట్టి శ్రీకాంత్‌, బచ్చు రమేశ్‌ పిలుపునిచ్చారు. కలకత్తాలో గాంధీజీకి జరిగిన అవమానానికి నిరసనగా సిద్దిపేటలోని గాంధీసర్కిల్‌లో మహాత్ముడి విగ్రహానికి పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పాల సాయిరాం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ.. గాంధీజీ ఓ కులానికి, వర్గానికి, మతానికి చెందిన వ్యక్తి కాదని, భారత జాతిపిత అని కొనియాడారు. ఆయనను అవమానిస్తే దేశంలోని ప్రతి పౌరుడికి అవమానం జరిగినట్లేనని పేర్కొన్నారు. ఈవిషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. వెంటనే దేశద్రోహం కేసు నమోదు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సోమ శ్రీకాంత్‌, జూలూరి నటరాజ్‌, అమర్‌పల్లి భాస్కర్‌, ఐత పురుషోత్తం, వ్యాపార సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-05T04:30:42+05:30 IST