గుడికి వెళ్లొస్తూ అనంతలోకాలకు!

ABN , First Publish Date - 2022-01-22T08:23:36+05:30 IST

తమను చల్లగా చూడమని వారు చేసిన ప్రార్ధన భగవంతుడికి చేరలేదో

గుడికి వెళ్లొస్తూ అనంతలోకాలకు!

  • యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో విషాదం
  • ఆగి ఉన్న డీసీఎంను  ఢీకొట్టిన ద్విచక్రవాహనం
  • తండ్రి, కొడుకు మృతి.. తల్లి,మరో కొడుకు పరిస్థితి విషమం


చౌటుప్పల్‌ రూరల్‌, జనవరి 21: తమను చల్లగా చూడమని వారు చేసిన ప్రార్ధన భగవంతుడికి చేరలేదో ఏమో.. ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే వారిని మృత్యువు పలకరించింది. మరో ఐదు నిముషాల్లోనే ఇంటికి చేరి, సంతోషంగా తుళ్లుతూ ఉండాల్సిన వారి జీవితాల్ని, రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం లక్కారంలో శుక్రవారం ఈ ఘోరం చోటుచేసుకుంది.


గ్రామానికి చెందిన డాకొజు రామకృష్ణ(38) క్షౌరవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన భార్య శ్రీలక్ష్మి(30), కుమారులు మణిచరణ్‌(13), విశ్వసాయి(10)లతో కలిసి శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టుకు దైవదర్శనానికి వెళ్లారు. మధ్యాహ్నం వరకూ క్షేత్రంలోనే సేదతీరి, తిరిగి వెనక్కి బయలుదేరారు. ఇక మరి కాసేపటిలో ఇంటికి చేరుకుంటారనగా.. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు దాటిన అనంతరం ఆరెగూడెం స్టేజి రోడ్డుపై మరమ్మతుల కోసం నిలిచిన డీసీఎంను రామకృష్ణ బైక్‌ ఢీకొట్టింది.


బండి నడుపుతున్న రామకృష్ణ అక్కడికక్కడే దుర్మరణంపాలయ్యారు. రక్తపు మడుగులో తీవ్రంగా గాయపడిన భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులను పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కుమారుడు వర్షిత్‌రెడ్డి తన బెంజి కారులో హైదరాబాద్‌ కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోపే చిన్నకుమారుడు విశ్వసాయి కన్నుమూశాడు. లక్ష్మి, మణిచరణ్‌ల పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స అందుతోందని అధికారులు తెలిపారు. క్షౌరవృత్తితో జీవనం సాగిస్తున్న రామకృష్ణది పేద కుటుంబమని స్థానికులు చెబుతున్నారు. ఆయన భార్య శ్రీలక్ష్మి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దకుమారుడు ఎనిమిది, చిన్నకుమారుడు నాలుగో తరగతి చదువుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే రామకృష్ణ కన్నుమూయడంతో లక్కారంలో విషాదం నెలకొంది.


Updated Date - 2022-01-22T08:23:36+05:30 IST