నగల దుకాణాల్లో ఐటీ దాడులు
ABN , First Publish Date - 2022-02-16T14:03:19+05:30 IST
కడలూరు, విరుదాచలం పట్టణాల్లోని రెండు ప్రముఖ నగల దుకాణాల్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కడలూరు తిరుప్పాతిపులియూరు ప్రాంతంలోని ప్రముఖ నగల దుకాణ శాఖ
చెన్నై: కడలూరు, విరుదాచలం పట్టణాల్లోని రెండు ప్రముఖ నగల దుకాణాల్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కడలూరు తిరుప్పాతిపులియూరు ప్రాంతంలోని ప్రముఖ నగల దుకాణ శాఖ పుదుచ్చేరిలో ఉంది. ఆ నగల దుకాణాల యజమానులు ఆస్పత్రి, విద్యా సంస్థలను నడుపుతున్నారు. కడలూరులో అతిపెద్ద మెగామాల్ను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడలూరు ఐటీ అధికారులు నగల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. నగల దుకాణం యజమాని నివాసగృహం, కార్యాలయాలు సహా 13 చోట్ల ఒకే సమయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే విధంగా విరుదాచలంలోని ప్రముఖ నగల దుకాణంలోనూ ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. కడలూరు జిల్లాలోని కడలూరు, విరుదాచలంలో ఒకే సమయంలో 15 చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. ఈ రెండు నగల దుకాణాల యజమానులు భారీ స్థాయిలో పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావటంతో ఈ తనిఖీలు జరిగాయని తెలుస్తోంది. ఈ తనిఖీలు జరుగుతున్న ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటైంది.