Wages: వేతన జీవులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది..

ABN , First Publish Date - 2022-09-28T02:01:16+05:30 IST

వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఉద్యోగుల సగటు వేతనం 10 శాతానికి పైగానే పెరిగే అవకాశం ఉన్నట్టు తాజాగా నివేదికలో వెల్లడైంది.

Wages: వేతన జీవులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది..

ముంబై: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు తప్పవన్న అంచనాలు ఓవైపు.. దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరోవైపు.. ఈ పరిస్థితులు ఎవరికైనా దడపుట్టించేవే..! ముఖ్యంగా జీతంరాళ్ల పైనే ఆధారపడే వారికి టెన్షన్ పెట్టే పరిస్థితులు ఇవి. ఇలాంటి స్థితిలో వేతన జీవులకు ఓ గుడ్ న్యూస్..! వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఉద్యోగుల సగటు వేతనం 10 శాతానికి పైగానే పెరిగే అవకాశం ఉన్నట్టు తాజాగా నివేదికలో వెల్లడైంది. 


జీతనాతాలకు సంబంధించి గ్లోబల్ ప్రొఫెషనల్ సంస్థ ఏయాన్(Aon) ఈ నివేదికను విడుదల చేసింది. ప్రతిభావంతులైన ఉద్యోగులు అనేక మంది తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో యాజమాన్యాలు వారిని సంస్థల్లోనే నిలుపుకునేందుకు వేతనాలు పెంచబోతున్నాయని(Salary Hike) ఏయాన్ అంచనా వేసింది. ‘‘వచ్చే ఏడాది భారత్‌లో జీతాలు సగటున పది శాతం మేర పెరిగే అవకాశం ఉంది’’ అని ఏయాన్ ప్రతినిధి రూపాంక్ చౌదరి వ్యాఖ్యానించారు. ఉద్యోగులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సంస్థలు సముచిత నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన చెప్పారు. 


ఏయాన్ నివేదిక ప్రకారం.. వేతనాల పెరుగుదలలో ఈ-కామర్స్‌ రంగం(E-Commerce) ముందంజలో ఉంది. ఈ రంగంలోని వారి సగటు వేతనాలు 12.8 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ఆ తరువాతి స్థానంలో అంకుర సంస్థలు ఉన్నాయి. స్టార్టప్ సంస్థల్లోని(Startups) ఉద్యోగుల సగటు వేతనం 12.7 శాతం పెరగొచ్చని ఏయాన్ అంచనా వేసింది. ఇక టెక్నాలజీ సంబంధిత రంగాల్లో వేతనాల వృద్ధి 11.3 శాతం ఉండగా.. ఫైనాన్షియల్ సంస్థల్లో ఇది 10.7 శాతంగా ఉండబోతోందని సమాచారం. ‘‘ ఆర్థికంగా ఎదురుగాలులు వీస్తున్న నేటి తరుణంలో ఉద్యోగుల బాగోగుల చూసుకునేందుకు సంస్థలు సమగ్రమైన విధానాన్ని అవలంభించాలి. వారికి తగిన ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలి. ప్రతిభావంతులైన ఉద్యోగులు సంస్థలు వీడకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి’’ అని ఏయాన్‌లోని హ్యూమన్ క్యాపిటల్ సొల్యూషన్స్ విభాగం డైరెక్టర్ జంగ్ బహదూర్ సింగ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-09-28T02:01:16+05:30 IST