రెండు గంటలపాటు ఆగిన గూడ్స్ రైలు
ABN , First Publish Date - 2020-12-04T03:51:06+05:30 IST
నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రైల్వే గేటు వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం అర్ధరాత్రి రైలు పట్టాలు దాటుతుండగా ఢీకొంది.
రైలింజన్కు అతుక్కుపోయిన యువకుడి మృతదేహం
వెంకటాచలం, డిసెంబరు 3 : నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళ్తున్న గూడ్స్ రైలు నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రైల్వే గేటు వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి బుధవారం అర్ధరాత్రి రైలు పట్టాలు దాటుతుండగా ఢీకొంది. సుమారు 35ఏళ్ల వయస్సు కలిగిన ఈ యువకుడు గూడ్స్ రైలు ఇంజన్ ముందు భాగం అతుక్కుని పోయాడు. దీంతో నెల్లూరు నుంచి వెంకటాచలం రైల్వేస్టేషన్ వరకు ఆ వ్యక్తిని రైలు లాక్కొని వచ్చింది. ఈ విషయాన్ని గూడ్స్ రైలు లోకో ఫైలట్ (డైవర్) గుర్తించి వెంకటాచలంలో రైలు ఆపి, రైల్వే అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్ధలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని రైలు నుంచి పక్కకు తొలగించారు. దీంతో గూడ్స్ రైలు సుమారు రెండు గంటలకు పైగా వెంకటాచలం రైల్వేస్టేషన్ల్లో ఆగిపోయింది. అయితే సదరు గుర్తుతెలియని వ్యక్తి రైలు మార్గం మఽధ్యలో ఆగి ఉన్నప్పుడు రైలు ఇంజన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కొందరు స్థానికులు, రైల్వే అధికారులు గుసగుసలాడారు. మృతుడు తెల్లగీతల చొక్కాతోపాటు గోధుమరంగు కట్ డ్రాయర్ ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు, వివరాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.