గోపాల మిత్రలు ఔట్!
ABN , First Publish Date - 2021-11-22T06:49:00+05:30 IST
పశు సంవర్థక శాఖలో పనిచేస్తున్న గోపాలమిత్రల పొట్టకొట్టారు. అదనంగా అప్పగించిన పనులు చేయకపోవడంతో పాటు విధులకు హాజరుకాలేదంటూ జిల్లాలోని 252 మంది గోపాల మిత్రలను తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
252 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు
ఏహెచఏ పోస్టులు ఖాళీలతో అదనపు పనులు వారికే అప్పగింత
ఆ పనులకు ప్రొసీడింగ్ ఇవ్వాలని కోరిన గోపాల మిత్రలు
చెప్పింది చేయాలంటూ ఉన్నతాధికారుల హుకుం
ఉన్నఫలంగా బయోమెట్రిక్ వేయని వారిపై వేటు
అనంతపురం వ్యవసాయం, నవంబరు 21: పశు సంవర్థక శాఖలో పనిచేస్తున్న గోపాలమిత్రల పొట్టకొట్టారు. అదనంగా అప్పగించిన పనులు చేయకపోవడంతో పాటు విధులకు హాజరుకాలేదంటూ జిల్లాలోని 252 మంది గోపాల మిత్రలను తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలగించిన గోపాల మిత్రల జాబితాను డీడీలకు పంపించి ఉత్తర్వులు అందించాలని ఆదేశించారు. స్థానిక అధికారులు ఆ గోపాల మిత్రల మెయిల్స్, వాట్సా్పలకు తొలగింపు ఉత్తర్వులు పంపారు. దీంతో బాధిత వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 366 మంది గోపాల మిత్రలు పనిచేస్తున్నారు. వీరిలో 114 మంది రైతు భరోసాకేంద్రాల్లో విధులకు హాజరై బయోమెట్రిక్ వేస్తున్నారు. మిగతా 252 మంది విధులకు హాజరుకాలేదంటూ తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారు.
ఏహెచఏ పోస్టుల ఖాళీలతో అదనపు పనులు
జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 800 మంది పశుసంవర్థక శాఖ సహాయకులు (ఏహెచఏ) పోస్టులకు నోటిఫికేషన జారీ చేశారు. ఇందులో 255 పోస్టులు భర్తీ అయ్యాయి. మిగతా 545 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆ సిబ్బంది లేని రైతు భరోసా కేంద్రాలకు గోపాల మిత్రలను మ్యాపింగ్ చేశారు. ఇప్పటి వరకు గోపాల మిత్రలు క్షేత్ర స్థాయిలో పశువులకు ప్రథమ చికిత్సతోపాటు కృత్రిమ గర్భధారణ పనులు చేస్తున్నారు. అలాగే మూడునెలలకోమారు నిర్వహించే క్యాంప్లకు హాజరై సేవలు అందిస్తూ వస్తున్నారు. ఖాళీగా ఉన్న ఏహెచఏ స్థానాల్లో గోపాలమిత్రలను నియమిస్తూ అదనపు పనులు చేయాలంటూ హుకుం జారీ చేశారు. మూడు నెలలుగా తమకు రైతు భరోసాకేంద్రాల్లో ఏఏ పనులు చేయాలన్న దానిపై ప్రొసీడింగ్ ఇవ్వాలని గోపాలమిత్రలు కోరుతూ వస్తున్నారు. అలాగే గోపాల మిత్రల సంఘం నాయకులు పలుమార్లు కలెక్టర్, పశు సంవర్థక శాఖ జేడీలకు వినతి పత్రాలు అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో సంఘం తీర్మానం మేరకు కొందరు గోపాల మిత్రలు రైతు భరోసా కేంద్రాల్లో నెల రోజులుగా బయోమెట్రిక్ వేయకుండా పనులు చేస్తూ వస్తున్నారు. అయితే ఉన్నట్లుండి డైరెక్టర్ ఆదేశాల మేరకు బయోమెట్రిక్ వేయని గోపాల మిత్రలను ఉన్నఫలంగా తీసేయాలంటూ జేడీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో 252 మంది గోపాల మిత్రలను తొలగిస్తూ జేడీ ఉత్తర్వులు ఇచ్చారు.
నేటి నుంచి నిరసన బాట
విధుల నుంచి గోపాల మిత్రలను తొలగించడంపై బాధిత గోపాల మిత్రలు నిరసన బాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. పశుసంవర్థక శాఖ జేడీ కార్యాలయం ఎదుట సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు గోపాల మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ స్పష్టం చేశారు. తమకు అప్పగించిన పనులకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా అనధికారికంగా పనులు చేయాలని చెప్పడం అన్యాయమన్నారు. మూడు నెలలుగా గౌరవ వేతనం కూడా ఇవ్వలేదన్నారు. ఇన్సెం టివ్ ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినా అధికారులు తప్పుదోవ పట్టించారన్నారు. తమకు తక్కువ వేతనం ఇస్తూ ఏహె చఏలు చేసే పనులన్నీ చేయించడం ఏ మేరకు సమంజ సమని ప్రశ్నించారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.