Gorantla Madhav: గోరంట్ల మాధవ్కు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-08-14T20:03:49+05:30 IST
పుల్లూరు టోల్ప్లాజా దగ్గర ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav)కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు.
కర్నూలు: పుల్లూరు టోల్ప్లాజా దగ్గర ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav)కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు. గోరంట్ల మాధవ్ ఒక మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియా (Social media)లో ప్రత్యక్షమైంది. ఆ తర్వాత ‘వైరల్’గా మారింది. ఈ వీడియోలో గోరంట్ల మాధవ్ పూర్తి నగ్నంగా కనిపించారు. మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. పార్లమెంట్ సమావేశాలు జరుగున్న సమయంలోనే ఈ వీడియో వైరల్ అయింది. ఈ దూమారానికి తాత్కాలికంగా తెర పడిన తర్వాత ఆయన హిందూపురానికి వస్తున్నారు. జిల్లాకు వస్తున మాధవ్కు కురుబ సంఘం నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఫేక్ వీడియోపై దుష్ప్రచారం సరికాదన్నారు. వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఓటుకు నోటు ఆడియోను అమెరికా ల్యాబ్లో టెస్ట్ చేయించి.. అది ఫేక్ అని ఆ నేతలు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. పోలీసులను స్వతంత్రంగా దర్యాప్తు చేయించాలన్నారు. బీసీలను అనగదొక్కేందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ విమర్శించారు.
గోరంట్ల మాధవ్ నగ్న వీడియో ఒక ఫోన్లో ప్లే అవుతుండగా మరో ఫోన్ ద్వారా రికార్డు చేశారని... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది అదే కాబట్టి, దానిని ‘ఒరిజినల్’ అనలేమని పోలీసులు తేల్చేశారు. మాధవ్ ‘ఊహించిన విధంగానే’ భారీ ఊరట కల్పించారు. ‘ఆ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ చెప్పేశారు’ అంటూ గోరంట్ల మాధవ్ కూడా తనకు క్లీన్చిట్ వచ్చేసినట్లుగా కలరింగ్ ఇచ్చారు. కానీ... ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా పోలీసులు నడిపించిన కథ అని రాజకీయ విశ్లేషకులు, ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వివాదాల చరిత్ర...
గోరంట్ల మాధవ్ గతంలో పోలీసు శాఖలో పని చేశారు. 1998లో ఆయన ఎస్ఐగా ఉద్యోగంలో చేరారు. కడప జిల్లాలో ఐదేళ్లు పని చేశారు. అప్పట్లో వ్యక్తిగత ఆరోపణలు రావడంతో ఆయనను అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది... అనంతపురం, కదిరిలో పని చేశారు. ‘సినిమా స్టైల్ పోలీ్స’గా పేరు తెచ్చుకోవడానికి ఆరాటపడే వారు. నాలుగు రోడ్ల కూడళ్లలో అందరూ చూస్తుండగానే లాఠీ ఝుళిపించడం ఆయన స్టైల్! గోరంట్ల మాధవ్ పగలు జనాల్లో పేరు కోసం హడావుడి చేస్తూ... రాత్రిళ్లు సెటిల్మెంట్లలో తలమునకలవుతారని చెబుతారు. ప్రధానంగా భూసమస్యలు, భార్యాభర్తల మధ్య తగాదాలు తీర్చడంపై దృష్టి సారించేవారు. నగలు, వస్త్ర దుకాణాలకు వెళ్లి నచ్చినవి తీసుకోవడం... డబ్బులు ఇవ్వకుండా వచ్చేయడం కూడా ఆయన శైలి అని చెబుతారు. కదిరి సీఐగా పనిచేసినపుడే గోరంట్ల మాధవ్పై ‘రాసలీల’ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంపీ అయిన తర్వాత కూడా అవి కొనసాగాయి. ఒక మహిళతో వివాదం ముదరడంతో తన బ్యాచ్కే చెందిన ఒక సీఐ సహకారంతో... ‘సెటిల్’ చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో ఆయనను వేకెన్సీ రిజర్వ్కు పంపించారు. నోట్ల రద్దు సమయంలో అనంతపురంలో బ్యాంకు వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని విచక్షణారహితంగా కొట్టి సస్పెన్షన్కు గురయ్యారు. ఎన్నికల ముందు టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డిపై మీసాలు దువ్వి సవాలు విసిరిన గోరంట్ల.. వైసీపీ దృష్టిని ఆకర్షించారు. ఎంపీ టికెట్ పొందారు.