ప్రైవేటు ప్రాక్టీసే ప్రాణం!
ABN , First Publish Date - 2022-09-20T16:08:43+05:30 IST
ప్రభుత్వ వైద్యుడిగా ఉంటూ పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లపై రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలోని
డ్యూటీ వేళల్లో కొందరు ప్రభుత్వ వైద్యుల తీరిది
రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని సేకరించిన విజిలెన్స్
ప్రభుత్వానికి నివేదిక.. ఆధారాలుగా వీడియోలు
28 మంది వైద్యులపై చర్యలకు సిఫారసు
వీరిలో ఇద్దరు హైదరాబాద్లోని
పెద్దాస్పత్రుల సూపరింటెండెంట్లు
వైద్యుల ఫోన్లకు జీపీఎస్.. ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలు
ప్రైవేటు ప్రాక్టీస్పై కమిటీకి విజిలెన్స్ సిఫారసు
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యుడిగా ఉంటూ పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లపై రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘా పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఆస్పత్రుల్లో డ్యూటీ వేళ్లలో ఆస్పత్రులకు రాని వైద్యులపై కన్నేసింది. వారు ఎప్పుడు ఆస్పత్రికి వచ్చారు? ఎన్ని గంటలకు తిరిగి వెళ్లారు? ఎంతసేపు ఆస్పత్రిలో ఉన్నారు? రోజూ ఆస్పత్రికి వస్తున్నారా? లేదంటే మూడు నాలుగు రోజులకోమారు వస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారా? ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుంటే ఏ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు? అన్న వివరాలను ఆధారాలతో సహా సేకరించింది. కొద్ది రోజుల క్రితమే దీన్ని నివేదిక రూపంలో సర్కారుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ అంజనీకుమార్ సమర్పించారు. అందులో కొన్ని వీడియో ఆధారాలను పొందుపర్చారు. కొన్ని ప్రతిపాదనలనూ సూచించారు. తన నివేదికలో విజిలెన్స్.. ఎంతమంది వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నారు? వారికున్న సొంత క్లినిక్లు ఏమిటి? ఏయే ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిజేస్తున్నారు? అన్న వివరాలను పొందుపరిచింది. ఈ నివేదికతో సర్కారు సీరియస్ అయింది. నివేదికలో పొందుపర్చిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని వైద్యవిద్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ను ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు. కాగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికలో ప్రాథమికంగా 28 వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ నివేదికను ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది.
ఆ నివేదికలో వైద్యుల పేర్లు, వారు ప్రస్తుతం పనిజేస్తున్న సర్కారు దవాఖానా, హోదా, ఏ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు? అన్న వివరాలు ఉన్నాయి. వైద్యవిద్య సంచాలకులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని వైద్యులే ఎక్కువగా డ్యూటీ వేళల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నారని ఆ నివేదికలో పేర్కొన్నారు.. సివిల్ సర్జన్ కంటే పెద్దర్యాంకులో ఉన్నవారే ఇలా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తుండటం విశేషం. నివేదికలో హైదరాబాద్లోని రెండు ప్రముఖ పెద్దాస్పత్రుల సూపరింటెండెంట్లు, అడిషనల్ డీఎంఈ స్థాయిలో ఉన్నవారి పేర్లు ఉండటం గమనార్హం. సర్కారు వైద్యులు ప్రభుత్వ పనివేళల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నారని ఆ నివేదికలో విజిలెన్స్ విభాగం పేర్కొంది. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కాల్ రాగానే ప్రభుత్వ వైద్యులు డ్యూటీ సమయంలోనే అక్కడకు వెళ్లి వైద్య సేవలందిస్తున్నారు. దీనివల్ల సర్కారీ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు వైద్య సేవలందడం లేదని అందులో వెల్లడించింది. కొంతమంది వైద్యులకు సొంతంగా నర్సింగ్ హోమ్లు, సొంత క్లినిక్లు అన్నాయని అందులో పేర్కొంది. సొంత ఆస్పత్రులున్న వైద్యులు కూడా డ్యూటీ వేళల్లో ఫోన్కాల్ వస్తే వెళ్లి తమ సొంత ప్రైవేటు ప్రాక్టీసుకు ప్రాధాన్యం ఇస్తున్నారని అందులో తెలిపింది. ప్రభుత్వ వైద్యులు డ్యూటీ వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయకూడదని 1983లో ప్రభు త్వం నిర్ణయించి, కొన్ని చర్య లు తీసుకున్నప్పటికీ, దాన్ని వైద్యులు ప్రస్తుతం పట్టించుకోవడంలేదని స్పష్టం చేసింది.
సిఫారసు చేసిన అంశాలేమిటి?
వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి విజిలెన్స్ విభాగం కొన్ని సిఫారసులు కూడా చేసింది. తమ నివేదికలో పేర్కొన్న వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రవేశ ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా వైద్యుల పనివేళలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని, దానికి ఆస్పత్రుల్లో ఇన్స్టాల్ చేసి న సీసీ కెమెరాలన్నింటినీ అనుసంధానం చేయాలని సిఫారసు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్రతి వైద్యుడి సెల్ఫోన్కు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేయాలని, ఆ జీపీఎస్ను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేసేలా చూడాలని సూచించింది. ఆ కంట్రోల్ రూమ్కు డిప్యూటీ లేదా అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించాలని సూచించింది. రోజూ ఆ కంట్రోల్ రూమ్నుం చి వైద్యుల పనివేళలను పర్యవేక్షించాలని పేర్కొంది. ఆ కంట్రోల్ రూమ్కు సిబ్బందిని నియమించుకోవాలని సూచించింది. సర్కారీ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై కమి టీ వేయాలని సూచించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఇన్స్టాల్ చేయాలని, వైద్యుల బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలని విజిలెన్స్ విభాగం పేర్కొంది.
వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్
విజిలెన్స్ ఇచ్చిన నివేదికతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. డ్యూటీ వేళల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై చర్యలకు ఉపక్రమించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ డీఎంఈ, టీవీవీపీ కమిషనర్ను ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా తమ ఆస్పత్రుల పరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. టీవీవీపీ కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలన్నింటినీ దానికి అనుసంధానం చేసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల విషయంపై ఒక కమిటీని వేసుకోవాలని ఆదేశించారు.
తప్పుడు రిపోర్టులతో వైద్యులను వేధించడం సరికాదు
వైద్య ఆరోగ్యశాఖలో ఓ అధికారి తన తప్పుడు నివేదికలతో వైద్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. విజిలెన్స్ నివేదికలో కొంతమంది వైద్యులు అసలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే పనిజేయడం లేదు. లేని ఆస్పత్రుల్లో వారు పనిజేస్తున్నట్లు రిపోర్టు ఇచ్చా రు. తప్పుడు రిపోర్టులతో వేధించడం సరికాదు.
-డాక్టర్ బొంగు రమేశ్, కన్వీనర్, తెలంగాణ మెడికల్ జేఏసీ