వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2022-10-02T05:24:42+05:30 IST
వయో వృద్ధుల సం క్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహి ళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవి అన్నారు.
- రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవి
వనపర్తి అర్బన్, అక్టోబరు 1: వయో వృద్ధుల సం క్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహి ళా కమిషన్ సభ్యురాలు ఉమాదేవి అన్నారు. శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి ఆమె జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, కుటుంబ సభ్యుల సంఖ్య తగ్గిపోవడం, చిన్నారుల పట్ల సరైన శ్రద్ధ చూపకపోవడం వలన వారిలో నైతికత లోపిస్తోందని అన్నారు. వృద్ధులు కమిషన్ దృష్టికి తమ సమస్యలను తెస్తున్నారని, అవి వింటుంటే ఎంతో బాధ కలుగుతోం దని అందరూ తమ ఇళ్లల్లో ఉన్న పెద్దలను గౌరవిస్తు వారిని మంచిగా చూసుకున్నప్పుడు వారు పిల్లల పట్ల చూపే ప్రేమ, ఆదరణ, నేర్పించే సత్ప్రవర్తన వలన మంచి చెడులు పిల్లలు అర్ధం చేసుకుంటారని సూచించారు. ‘మా ఇంటికి రండి.. మీ పెద్దలను గౌరవిస్తాం’ అనే శీర్షికపై వ్యాసరచన పోటీలను నిర్వహించి, అందులో విజేతలైన విద్యార్థులకు ఆమె బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. లోక్నాథ్రెడ్డి మాట్లాడుతూ వృద్ధులను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని, వారిని నిర్లక్ష్యం చేయొదని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా వృద్ధులు సంరక్షణకు దూరమైనప్పుడు, ఫోన్ నంబర్ 14567కు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చునని తెలిపారు. అనంతరం సీనియర్ సిటిజన్స్కు గుర్తింపు కార్డులను ఆమె అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీడబ్ల్యూవో పుష్పలత, సీడబ్ల్యూసీ అలివేలమ్మ, సత్తార్, ఖాజాకుతుబుద్దీన్, జిల్లా అధికారులు, సీడీపీవోలు, డీసీపీవోలు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.