పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి: జేసీ
ABN , First Publish Date - 2022-01-26T05:16:37+05:30 IST
పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని జాయింట్ కలెక్టర్ ఆసరా అండ్ సంక్షేమం శ్రీనివాసులు అన్నారు.
కర్నూలు(న్యూసిటీ) జనవరి 25: పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని జాయింట్ కలెక్టర్ ఆసరా అండ్ సంక్షేమం శ్రీనివాసులు అన్నారు. మంగళవారం జిల్లా పర్యాటక శాఖ అధికారి బి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పాఠశాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పర్యాటక అభివృద్ధి పనులకు రూ.9 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం నంద్యాలకు చెందిన ఫ్రీడమ్ ఫైటర్ వడ్డె ఓబన్న వారసుడు వి.బాలనరసిహులను సన్మానించారు. పర్యాటకరంగ అభివృద్ధిపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో విజేతలకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం అడ్మిన్ నాగార్జున, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాశాంతి, విద్యార్థులు పాల్గొన్నారు.