ప్రభుత్వ ఉద్యోగుల పోరుబాట
ABN , First Publish Date - 2021-12-08T06:38:49+05:30 IST
జిల్లాలో లక్షన్నర మంది ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల సాధనకు నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం విధులు నిర్వర్తించారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రం, ఆపై గ్రామస్థాయి వరకు కార్యాలయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల నుంచీ తమను మోసం చేస్తూనే ఉందంటూ నినదించారు. పీఆర్సీ నుంచి డీఏ బకాయిల వరకు అన్నింటా అన్యాయం
జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల మంది నిరసన
పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని నినాదాలు
నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు
అన్ని శాఖలతో పాటు ఆర్టీసీ, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా
గురువారం వరకు ఆందోళన కొనసాగింపు... 13 నుంచి ర్యాలీలు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో లక్షన్నర మంది ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టారు. తమ డిమాండ్ల సాధనకు నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం విధులు నిర్వర్తించారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రం, ఆపై గ్రామస్థాయి వరకు కార్యాలయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల నుంచీ తమను మోసం చేస్తూనే ఉందంటూ నినదించారు. పీఆర్సీ నుంచి డీఏ బకాయిల వరకు అన్నింటా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. జీతాలు ఒకటో తేదీన కూడా అందట్లేదని లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యోగ సంఘాల పిలుపుమేరకు మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్ సహా అన్ని కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది వీటిని ధరించారు. కొన్నిచోట్ల ఉద్యోగ సంఘాల నేతలు కార్యాలయాలకు వెళ్లి అధికారులు, ఉద్యోగులకు నల్ల బ్యాడ్జీలు అందించారు. ఇప్పటికే తమ డిమాండ్లపై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చామని, అయినా స్పందన లేకపోవడంతో ఆందోళనబాట పట్టాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. తొలిరోజు ఆందోళనలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులతో పాటు ఆర్టీసీ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల వరకు అంతా పాల్గొన్నారు. మొత్తం లక్షన్నర మంది ఉద్యోగులు జిల్లాలో ఉన్నారని, వీరంతా డిమాండ్ల సాధనకు ఆందోళన కొనసా గిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. అయితే ట్రెజరీ శాఖలోని కొందరు ఉద్యోగులు నిరసనకు దూరంగా వున్నారు. కాగా ఈనెల 9 వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ నెల 13 నుంచి తాలుకా, డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నారు. 16వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ధర్నా చేయనున్నారు.