ప్రభుత్వ భూమి పరిశీలన

ABN , First Publish Date - 2021-07-28T06:17:24+05:30 IST

మండలంలోని నేరేడుపల్లి గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితసింగ్‌ మంగళవారం పరిశీలించారు.

ప్రభుత్వ భూమి పరిశీలన
భూమి వివరాలు పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌ అపరాజితాసింగ్‌

పీసీపల్లి, జూలై 27: మండలంలోని నేరేడుపల్లి గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితసింగ్‌ మంగళవారం పరిశీలించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అక్కడ భూసేకరణలో భాగంగా అటవీశాఖకు చెందిన 60 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అయితే అటవీశాఖ నిబంధనల మేరకు అవసరాలకు ప్రభుత్వం అటవీ భూమిని తీసుకుంటే అంతే భూమిని ప్రభుత్వం అటవీశాఖకు అప్పజెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగా పీసీపల్లి మండలం నేరేడుపల్లిలో ఉన్న సర్వేనెంబరు 398లో ఉన్న 923.78 ఎకరాల ప్రభుత్వ భూమిలో 60 ఎకరాలను అటవీశాఖకు అప్పజెప్పేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు.  ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు తమ పశువులన్నీ పశుగ్రాసం కోసం ఆ ప్రాంతానికి వెళ్తాయని ఆ భూమిని అటవీశాఖకు అప్పజెప్తే పశుగ్రాసం దొరకక మూగజీవాలైన గేదెలు,మేకలు,గొర్రెలు ఆకలితో అలమటిస్తాయని సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతోగ్రామస్థుల వినతి మేరకు నేరేడుపల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని తహశీల్దార్‌ సింగారావుతో కలిసి ఆమె పరిశీలించారు.  సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ఆమె పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించండి : ఎమ్మెల్యే

లింగసముద్రం : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పారు. మంగళవారం ఆయన తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి  అర్జీలు సమర్పించారు. ఈ సందర్బంగా కనిగిరి అటవీ రేంజర్‌ కే.రామిరెడ్డి ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బ్రహ్మయ్య యంపీడీఓ కె శ్రీనివాసరెడ్డి, మండల వైసీపీ కన్వీనర్‌ పి తిరుపతిరెడ్డి, వైసీపి నాయకులు సర్పంచ్‌ పులి పెదరాఘవులు, వరికూటి కృష్ణారెడ్డి, సూరం కొండారెడ్డి, వెన్నపూస కొండారెడ్డి, వంకాయలపాటి వెంకటేశ్వర్లు, ఏఓ జి మధు, ఏపీయమ్‌ నారాయణరావు, ఏఈ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మైనింగ్‌ అనుమతులు లేవు

మండలంలోని మొగిలిచెర్ల అటవీపరిధిలోని భూములకు ఎలాంటి మైనింగ్‌ అనుమతులు ఇవ్వవద్దని ఈ సందర్భంగా రెంజర్‌ రామిరెడ్డి తహసీల్దార్‌ను కోరారు. గతంలో  సర్వే నంబరు 241లో ముగ్గురు వ్యక్తులు మైనింగ్‌ కోసం 2016లో అప్పటి ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ మైనింగ్‌కు అనుమతి ఇచ్చారు. దీనికి పర్యవరణ, అటవీ అనుమతులు లేకపోవడంతో నిలిపివేశామన్నారు. 1995లో అడవులు, చిట్టడవుల్లో మైనింగ్‌కు అనుమతులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఆదేశించిందని రామిరెడ్డి తహసీల్దార్‌ బ్రహ్మయ్యకు చెప్పారు. 

Updated Date - 2021-07-28T06:17:24+05:30 IST