ప్రభుత్వ ఉచితాలకు మోసపోకండి: జేసీ ప్రభాకర్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-14T00:37:34+05:30 IST
వైసీపీ ప్రభుత్వ ఉచితాలకు మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అనంతపురం: వైసీపీ ప్రభుత్వ ఉచితాలకు మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు అన్నీ ఉచితమని వైసీపీ చెప్పిన మాటలను నమ్మి గెలిపించిన ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. సామాన్య ప్రజలను బతకలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా కొత్త రూల్స్ అమలు చేసి తీవ్ర అవస్థలకు గురిచేయడం సరికాదని అన్నారు. కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.లక్ష ఆర్థికసాయం అందించేందుకు జిల్లాకు పర్యటనకు వస్తే, బాధిత రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం కొంత డబ్బు జమ చేసిందని తెలిపారు. పవన్ ప్రశ్నిస్తేనే మీరు బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరిని మార్చుకొని, బాధితరైతు కుటుంబాలకు ఆర్థికం సాయం చేయాలని జేసీ ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు.