నేను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసమే: తమిళిసై

ABN , First Publish Date - 2022-04-07T20:24:26+05:30 IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

నేను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసమే: తమిళిసై

న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్  తమిళిసై గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌ ప్రభుత్వంతో ప్రొటోకాల్‌ వివాదంతో పాటు.. పలు అంశాలను అమిత్‌షాకు వివరించినట్లు చెప్పారు. తానేప్పుడూ నిర్మాణాత్మకంగా ఆలోచిస్తానన్నారు. తాను ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజల కోసమేనని తెలిపారు. తెలంగాణలో గవర్నర్‌ ప్రయాణించాలంటే రోడ్డుమార్గమే దిక్కని, గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. తాను ఏమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? బీజేపీ కార్యకర్తలను వెంటేసుకొని వెళ్లానా? అని ప్రశ్నించారు.


సీఎస్‌ వచ్చి సమస్య ఏంటో తనతో మాట్లాడాలని తమిళిసై అన్నారు. తనను బీజేపీ కార్యకర్త అని ఎలా అంటారని తమిళి సై ప్రశ్నించారు. తాను అన్నిపార్టీల నేతలను కలిశానని, ఏదైనా ఉంటే.. అడిగితే.. సమాధానం చెబుతానన్నారు. గణతంత్ర, ఉగాది వేడుకలకు వారు ఎందుకు రాలేదని  నిలదీశారు. ఇదేనా వారు ఇచ్చే మర్యాద?.. సీఎం కేసీఆర్ సహా అందరినీ ఆహ్వానించానని.. ఆధారాలు కూడా చూపిస్తానన్నారు. ఇది తమిళిసై సమస్య కాదని.. గవర్నర్ ఆఫీస్‌కు జరుగుతున్న అవమానమని అన్నారు. ఈ నెల 11వ తేదీన భద్రాచలంకు రోడ్డు మార్గంలోనే వెళ్తానని తమిళి సై పేర్కొన్నారు.

Updated Date - 2022-04-07T20:24:26+05:30 IST