బ్రాహ్మణకోడూరు టూ బ్యాంకాక్‌

ABN , First Publish Date - 2021-03-06T06:15:20+05:30 IST

పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన డాక్టర్‌ చింతల గోవిందరాజులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.

బ్రాహ్మణకోడూరు టూ బ్యాంకాక్‌
ఢిల్లీలో కేంద్ర వ్యవసాయమంత్రి తోమర్‌తో నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ గోవిందరాజులు

అంతర్జాతీయస్థాయి పదవి అందుకున్న గోవిందరాజులు

పసిఫిక్‌ దేశాల రుణ సంస్థ చైర్మన్‌గా జేకేసీ పూర్వ విద్యార్థి 

గుంటూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన డాక్టర్‌ చింతల గోవిందరాజులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. నాబార్డు చైర్మన్‌గా ఉన్న ఆయన్ను   శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయమంత్రి థోమర్‌ ఆధ్వర్యంలో పసిఫిక్‌ దేశాల సభ్యులు బ్యాంకాక్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న గ్రామీణ వ్యవసాయ రుణ పరపతి సంస్థ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 24 దేశాల్లోని 88 అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సభ్యులుగా ఉన్న  ఆసియా పసిఫిక్‌ రూరల్‌, అగ్రికల్చర్‌ క్రెడిట్‌ అసోసి యేషన్‌(ఏపీఆర్‌ఏసీఏ) చైర్మన్‌గా డాక్టర్‌ చింతల గోవిందరాజులు రెండేళ్లు సేవలు అందించనున్నారు. ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల స్థితిగతులు, బ్యాంక్‌రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు, వ్యవసాయ అనుబంద పరిశ్రమల స్థాపన, వలసల అదుపు తదితర అంశాలను పరిశీలిస్తుంది. డాక్టర్‌ చింతల గోవిందరాజులు ఏడాది నుంచి నాబార్డు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ రుణపరపతి  సంస్థ చైర్మన్‌ తెలుగువారికి దక్కడం అరుదైన అవకాశమని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్‌ యలమంచిలి శివాజీ, జేకేసీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ పాతూరి కోటేశ్వరరావు తెలిపారు.  గోవిందరాజులు విద్యాభ్యాసం గుంటూరు పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌, జేకేసీ, బాపట్ల వ్యవ సాయ కళాశాలలో జరిగింది.   

Updated Date - 2021-03-06T06:15:20+05:30 IST