జీపీఎఫ్ ఉఫ్
ABN , First Publish Date - 2022-06-29T07:59:49+05:30 IST
జీపీఎఫ్ ఉఫ్
800 కోట్ల ఉద్యోగుల సొమ్ము మాయం
వారికి తెలియకుండానే లాగేసుకున్న ప్రభుత్వం
రెండు డీఏల సొమ్ము వేసినట్లే వేసి.. వెనక్కి
90 వేల మంది ఉద్యోగులకు సర్కారు ఝలక్
అర్ధరాత్రి నుంచే ఫోన్లకు మెసేజ్లు
జీపీఎఫ్ వార్షిక స్టేట్మెంట్లో వివరాలు
మా సొమ్ము ఎలా లాక్కుంటారని ఉద్యోగుల ఫైర్
ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
ఉద్యోగ సంఘ నేతల హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 వేల మంది ఉద్యోగులకు చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్ నిధులు మాయమైపోయాయి! ఉద్యోగులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండానే ప్రభుత్వం ఆ సొమ్మును లాగేసుకుంది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం జీపీఎఫ్ నుంచి అడ్వాన్సు ఇప్పించాలని ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లో ఉండగా.. ఇప్పుడు వారి ఖాతాలను ఖాళీ చేయడం కలకలం సృష్టిస్తోంది. అకౌంటెంట్ జనరల్ కార్యాలయం(ఏజీ) గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల జీపీఎఫ్ వార్షిక స్టేట్మెంట్ను వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ లావాదేవీలను చూసుకున్న ఉద్యోగులకు అసలు సంగతి తెలిసింది. తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే సొమ్ము డెబిట్ అయినట్లు తేలింది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో జూలై 2018, జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి వారికి తెలియకుండానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. తమ ఖాతాల్లో డబ్బులు విత్డ్రా అయినట్లు మెసేజ్లు రావడంతో ఈ విషయాన్ని ఉద్యోగులు, సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మళ్లీ ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేసింది. ఇదంతా గతం! తాజాగా... సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అవుతున్నట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోమవారం అకౌంట్టెంట్ జనరల్(ఏజీ) తమ వెబ్సైట్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ జీపీఎఫ్ ఖాతాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన స్లిప్పులు అందుబాటులో ఉంచింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు తమ జీపీఎఫ్ ఖాతాల్లో గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలు చూసుకున్నారు. డీఏ బకాయిల రూపంలో తమ ఖాతాల్లో జమ అయిన జీపీఎఫ్ సొమ్ము మళ్లీ మాయమైనట్లు గుర్తించారు. మార్చి నెలలో ఉద్యోగుల ఖాతాల నుంచి జీపీఎఫ్ సొమ్ము ఉపసంహరించినట్లు స్టేట్మెంట్లో కనిపిస్తోంది. డీఏ ఎరియర్స్ బకాయిలు చెల్లించినట్లే చెల్లించి తమకు తెలియకుండానే ఖాతాల్లో సొమ్ము మాయం చేశారని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాము దాచుకున్న డబ్బులకు ప్రభుత్వం బ్యాంకర్గా వ్యవహరించాలని... తమ అనుమతి లేకుండా ఎవరు విత్డ్రా చేసినా అది క్రిమినల్ కేసు అవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మార్చి నెలలో తమ ఖాతాల్లో జరిగిన లావాదేవీలను అకౌంటెంట్ జనరల్ తమకు ఇప్పటి వరకు ఎందుకు తెలియజేయలేదని నిలదీస్తున్నారు.
నాయకుడి ఖాతా నుంచీ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ జీపీఎఫ్ ఖాతా నుంచి కూడా 83వేలు విత్డ్రా అయ్యాయి. ఇదే అంశంపై ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆర్థిక శాఖ అధికారులనుకలిసి ఫిర్యాదు చేయాలని ఆయన మంగళవారం సచివాలయానికి వచ్చారు. కానీ... ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగారు.
ఆ భయమే నిజమౌతోంది....
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ సర్కార్ అయినకాడికి అప్పులు తెస్తోంది. ఒకటో తారీఖు వేతనాలు పడటం గగనంగా మారింది. రిటైర్డ్ అయిన ఉద్యోగుల ప్రయోజనాలు అందడానికి నెలలు పడుతోంది. దీంతో... రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొంది. జీపీఎఫ్ సొమ్ములు ఖాళీ చేస్తారనే ఆందోళన మొదలైంది. ‘ఎందుకైనా మంచిది’ అని కొందరు, నిజంగానే అవసరాల కోసం కొందరు... జీపీఎఫ్ అడ్వాన్సుల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఇల్లు, వాహనాలు, పిల్లల చదువులు, వివాహాల కోసం అడ్వాన్స్ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకుని నెలలు గడుస్తున్నా... మంజూరు కావడంలేదు. తాజా లెక్కల ప్రకారం... జీపీఎఫ్ అడ్వాన్సుల దరఖాస్తులు, ఏఈజీఎల్ఐ, ఇతర అడ్వాన్సుల కింద ఉద్యోగులకు రూ.2వేలకోట్లకుపైగా అందాలి. 2018 జూలై 1, 2019 జనవరి 1కి సంబంధించిన 2 డీఏలు దాదాపు 6వేల కోట్లు చెల్లించాలి. ఆ తర్వాతి కాలానికి చెందిన మరో రెండు డీఏలు రూ.2వేల కోట్లు! వెరసి... ఉద్యోగులకు రూ.10 వేల కోట్లు ప్రభుత్వం బాకీ!
పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
‘‘ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరించడాన్ని తీవ్రమైన క్రిమినల్ చర్యగా భావిస్తున్నాం. సుమారు 90 వేల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు తీసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ చర్యకు పాల్పడిన సీఎ్ఫఎంఎస్ ఆధికారులపై తక్షణమే చర్యలు చేపట్టాలి. సీఐడీ విచారణ జరపాలి. గత ఏడాది కూడా ఇలాగే జరిగితే విచారణ జరపాలని సీఎఎ్సను కోరాం. ఈ అంశంపై విచారణ చేస్తామని, కమిటీ కూడా వేస్తామని హామీ ఇచ్చారు. కానీ... అది కార్యరూపం దాల్చకముందే మళ్లీ ఈ ఆర్థిక సంవత్సరం రూ.800 కోట్ల నగదు ఉపసంహరించడాన్ని ఎలా ఆర్థం చేసుకోవాలి? ఆర్థిక శాఖ అధికారులు, అధికారులు, ఏజీ అధికారులు ఏ అనుమతులతో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి డబ్బు తీసుకున్నారో చెప్పాలి. ఉద్యోగుల సమ్మతి లేకుండా మా ఖాతాల్లో నుంచి సొమ్ము ఎవరో విత్డ్రా చేయడం నేరం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తాం’’
- సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.