పట్టపగలే చోరీ
ABN , First Publish Date - 2021-04-24T04:17:43+05:30 IST
సినిమా తరహాలో పట్టపగలు ఓ ఆగంతకుడు చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్న బ్యాంకు ఆవరణలో వృద్ధురాలిని బురిడీ కొట్టించి నగలతో పరారయ్యాడు. ఈ సంఘటన సింహాచలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శుక్రవారం జరిగింది.
మహిళను బురిడీ కొట్టించి నగలు కాజేసిన ఆగంతకుడు
సింహాచలం ఎస్బీఐలో సంఘటన
సింహాచలం, ఏప్రిల్ 23: సినిమా తరహాలో పట్టపగలు ఓ ఆగంతకుడు చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్న బ్యాంకు ఆవరణలో వృద్ధురాలిని బురిడీ కొట్టించి నగలతో పరారయ్యాడు. ఈ సంఘటన సింహాచలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శుక్రవారం జరిగింది. బాధితురాలు, పోలీసులు అందించిన వివరాల మేరకు విజినిగిరిపాలెంనకు చెందిన కోరాడ సూర్యకాంతం (65) తమ కుమార్తె ఆదిలక్ష్మికి డబ్బు అవసరమై ఆమె చెవిదిద్దులు, పులిగోరు చైన్, మూడుపేట్ల బంగారు గొలుసులను కుదువపెట్టేందుకు సింహాచలం బ్యాంకుకు చేరుకుంది. అక్కడ పలువురు ఖాతాదారులకు విత్డ్రా, డిపాజిట్ ఫారాలు నింపుతున్న అపరిచిత వ్యక్తిని బంగారు ఆభరణాల రుణం గురించి వాకబు చేసింది. ఇదే అదనుగా భావించిన ఆగంతకుడు ఆమె నుంచి స్వర్ణాభరణాలను తీసుకుని బ్యాంకు లోపలికి వెళ్లి సిబ్బందిని వాకబు చేసి, వృద్ధురాలికి సోమవారం రావాలని చెప్పి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తరువాత తాను సంతకాలు కూడా పెట్టకుండా సోమవారం రావడమేంటనే అనుమానంతో అతడిని వెతకడం ప్రారంభించింది. అప్పటికే ఆగంతకుడు పరారవడంతో బాధితులు లబోదిబో మంటూ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గోపాలపట్నం పోలీసులు వచ్చి బ్యాంక్లోని సీసీ టీవీ ఫుటేజిని పరిశీలించారు. అయితే ఆగంతకుడు ముఖానికి మాస్కు వేసుకోవడంతో గుర్తుపట్టలేకపోయారు. ఇన్చార్జి ఎస్ఐ సుదర్శన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.