కల్లాల్లోనే ధాన్యం

ABN , First Publish Date - 2022-05-07T04:14:55+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి

కల్లాల్లోనే ధాన్యం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో నీట మునిగిన ధాన్యం

- అకాల వర్షంతో తడిసిన పంట
- ఆందోళనలో అన్నదాతలు
- జిల్లాలో 221 కొనుగోలు కేంద్రాలు లక్ష్యం
- ఇప్పటికి ప్రారంభించింది 26 మాత్రమే
-  కొనుగోలు లక్ష్యం 1.54 లక్షల మెట్రిక్‌ టన్నులు
- యాసంగిలో 73 వేల 600 ఎకరాల్లో వరి సాగు

మంచిర్యాల, మే 6 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో కల్లాల్లోనే ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్‌లో 221 పై చిలుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉండటం రైతులకు శాపంగా పరిణమించింది. జిల్లాలో కోతలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 26 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటుకు నోచుకున్నాయి.  వరి పంట దిగుబడికి సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదు. 20 రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి కసరత్తు ప్రారంభించిన అఽధికార యంత్రాంగం ఆచ రణలో పెట్టడంలో మాత్రం వెనుకబడి పోయింది. ఫలితంగా ఆరుగాలం శ్రమించి, అధిక వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేసిన వరి పంట మూడు రోజుల క్రితం గాలివాన బీభత్సానికి కకావికలం అయింది. ఈ నెల 3న రాత్రి కురిసిన అకాల వర్షానికి పంటంతా నీట మునగగా, రైతన్నకు తీరని నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా జిల్లాలో 4,800 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

- కొనుగోళ్లపై దోబూచులాట..
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఇంతకాలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడాయి. కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టగా, ప్రసక్తే లేదని కేంద్రం పేర్కొనడంతో వరి పండించిన రైతుల్లో ఒకింత ఆందోళన మొదలయింది. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ సర్కారు ప్రత్యక్ష ఆం దోళనలకు దిగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటూ కాలం వెళ్లదీశారు. దీంతో ఆరుగాలం శ్రమిం చి సాగు చేసిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక అన్నదాతలు ఆయోమయానికి గురయ్యారు. పంట కోసే సమయం వరకు ప్రభుత్వం నుంచి సూచనలు రాకపోవడంతో అధికారులు సైతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. తీరా తామే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హడావుడిగా ప్రకటించడంతో అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. పంట కోతకు వచ్చే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని ఉంటే తమకు అకాల నష్టం జరిగి ఉండేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.

- యాసంగి సీజన్‌కు..
యాసంగి సీజన్‌కు లక్షా 54వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత యాసంగితో పోలిస్తే ఈ ఏడాది వరి సాగు గణనీయంగా పడిపోయింది. గత సీజన్‌లో 2.30 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 2 లక్షల 23వేల 479 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం లక్షా 54వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే వరి సాగు చేయవద్దనే రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలో దాదాపు 70వేల పై చిలుకు మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి తగ్గిపోయింది. యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 29వేల మంది రైతులు సాగు చేసిన 73వేల 600 ఎకరాల్లో లక్షా 75వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధి కారులు అంచనా వేస్తున్నారు. ఇందులో దొడ్డు రకం లక్షా 54వేల మెట్రిక్‌ టన్నులు ఉంటుందని భావిస్తున్నారు. యాసంగి సీజన్‌లో ముందుగా సాగు చేసిన చోట దాదాపు నెల రోజుల క్రితమే వరి కోతలు ప్రారం భంకాగా దిగుబడి అంచనాకు సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.

- జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి  ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గత సీజన్‌లో మొత్తం 245 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఈ సంవత్సరం పంట ది గు బడి తగ్గినందున సెంటర్ల సంఖ్య కూడా తగ్గించారు. ఈ సీజన్‌కు సం బంధించి డీఆర్‌డీఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో 80 కేంద్రాలు ఏర్పాటు చే యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే జిల్లా కో ఆపరేటివ్‌ సొసైటీ (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో 100, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 60 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ నెల 5వ తేదీ వరకు కేవలం 26 కేంద్రాలను ప్రారంభమయ్యాయి. కాగా 811 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.

ధాన్యం తడిసిపోయింది..
- అత్తె గంగాధర్‌, నెల్కి వెంకటాపూర్‌

రెండెకరాలు సొంత భూమితోపాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. తీరా పంట కోసి ఆరబెట్టిన తరువాత అ కాల వర్షం కురిసి ధాన్యం మొత్తం తడిసిపోయింది. కొంత మొత్తం వరదలకు కొట్టుకొని పోయింది. అధికారులు సకాలంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఉంటే పంటను అమ్ముకొనే వాడిని. ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ యేడాది పంట ఏపుగా ఎదగడంతో దిగు బడి లాభసాటిగా ఉంటుందని ఆశలు పెట్టుకున్నాం.

Read more