గ్రావెల్ తవ్వేసి.. కాసులు కాజేసి!
ABN , First Publish Date - 2021-03-09T05:21:35+05:30 IST
చిల్లకూరు మండలంలో సిలికా ఖనిజ సంపద తరువాత ఎంతో విలువైనది గ్రావెల్ (ఎర్రమట్టి). దీనిపై కన్నేసిన అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకనే టన్నుల కొద్దీ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
యథేచ్ఛగా మట్టి అమ్మకాలు
చూసీచూడనట్టు ఉన్న అధికారులు
చిల్లకూరు, మార్చి 8 : చిల్లకూరు మండలంలో సిలికా ఖనిజ సంపద తరువాత ఎంతో విలువైనది గ్రావెల్ (ఎర్రమట్టి). దీనిపై కన్నేసిన అక్రమార్కులు ఎలాంటి అనుమతులు తీసుకోకనే టన్నుల కొద్దీ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మండలంలో గ్రావెల్ ఎక్కడ ఉంటే అక్కడ ఏపీఎం డీసీ (ఆంధ్రప్రదేశ్ మైన్స్ డెవల్పమెంట్ కార్పొరేషన్) పేరుతో తవ్వకాలు చేస్తున్నారు. ఆ సంస్థకు ఇది సంబంధం లేకపోయినా దానిపేరుతో కొందరు వ్యాపారులు పట్టపగలే గ్రావెల్ తవ్వకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో అధికారులు పట్టించుకున్నా, మరికొన్ని సందర్భాలలో చూసీచూడనట్టు వ్యవరిస్తున్నారు. దీంతో విచ్చలవిడిగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విలువైన గ్రావెల్ అక్రమంగా తరలిపోవడంతోపాటు గ్రామాలకు సమీప ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. పలు గ్రామాల్లోని నివాసప్రాంతాలకు దగ్గర ప్రమాదకర గుంతలు ఏర్పడటం వల్ల సమీపప్రాంతాల ప్రజలు, పశువులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయి.
పేదవాడికి ఆంక్షలా!?
అయితే,, గ్రామీణ ప్రాంతాల్లో గుంతలమిట్టలుగా ఉన్న పేదవాడి నివాసగృహలను లెవెల్ చేసుకునేందుకు మట్టి కావాలంటే అధికారులు సవాలక్ష అంక్షలు పెడుతున్నారని పలువురు అంటున్నారు. తహసీల్దారు అనుమతులు మంజూరు చేసినా రెవెన్యూ సిబ్బంది మాత్రం పేదవాడు మట్టిని తొలుకునేందుకు మంజూరు చేయాలంటే నిబంధ నలు పేరుతో నిలిపివేస్తున్నారు, మంజూరు కోసం వారాల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తున్నది. అదే వ్యాపారాలకు మాత్రం గంటల వ్యవధిలోనే మట్టి తోలకాలకు అనుమతులు మంజూరవుతున్నాయని పలువురు అంటున్నా రు. జిల్లా ఉన్నతాఽధికారులు అక్రమ గ్రావెల్ తవ్వకాలను ఆరికట్టేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.