కొవిడ్ టీకాలు వేయించుకోని వృద్ధులకు నేటి నుంచి జరిమానా

ABN , First Publish Date - 2022-01-17T18:04:36+05:30 IST

అరవై ఏళ్ల వయసు నిండిన వారు కొవిడ్ టీకాలు వేయించుకోకుంటే వారికి సోమవారం నుంచి జరిమానాలు విధించాలని గ్రీస్ ప్రభుత్వం నిర్ణయించింది.....

కొవిడ్ టీకాలు వేయించుకోని వృద్ధులకు నేటి నుంచి జరిమానా

గ్రీస్ సర్కారు ఉత్తర్వులు

బ్లూమ్‌బెర్గ్ (గ్రీస్): అరవై ఏళ్ల వయసు నిండిన వారు కొవిడ్ టీకాలు వేయించుకోకుంటే వారికి సోమవారం నుంచి జరిమానాలు విధించాలని గ్రీస్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంతోపాటు ఆరోగ్య సంరక్షణపై ఒత్తిడిని తగ్గించేందుకు గ్రీస్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వృద్ధులకు కొవిడ్ టీకాలు వేయడానికి ఈ జరిమానాలు విధిస్తున్నామని గ్రీస్ ప్రధానమంత్రి కైరియాకోస్ మిత్సోటాకిస్ చెప్పారు. ఇప్పటికీ టీకాలు వేయించుకోని వృద్ధులు ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలని కైరియాకోస్ కోరారు. కొవిడ్ టీకాలు వేయించుకోకపోతే ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. కొవిడ్ మరణాల్లో 10 మందిలో 9 మంది 60 ఏళ్ల వయసుకంటే ఎక్కువ వారున్నారు.


 ఆసుపత్రుల్లో చేరిన కరోనా రోగుల్లో 10 మందిలో ఏడుగురు కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారున్నారు. గ్రీస్ దేశంలో 5,20,000 మంది వృద్ధులు కొవిడ్ టీకాలు వేయించుకోలేదని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. టీకాలు వేయించుకోని వృద్ధులకు నెలకు 100 యూరోల జరిమానా విధిస్తామని గ్రీస్ అధికారులు చెప్పారు.యూరప్‌లోని గ్రీస్‌ దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కారణంగా ఈ నెలలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయి. కొవిడ్-సంబంధిత మరణాలు మునుపటి కంటే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 


Updated Date - 2022-01-17T18:04:36+05:30 IST