గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూములిచ్చేది లేదు

ABN , First Publish Date - 2020-12-04T04:46:00+05:30 IST

తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే రోడ్డు నిర్మాణానికి ఇచ్చేది లేదని అవసరమైతే ఢిల్లీ తరహా ఉద్యమం చేపడతామని రైతులు ప్రతినబూనారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూములిచ్చేది లేదు
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌

 ఢిల్లీ తరహా ఉద్యమం చేపడతాం

 మూడుగ్రామాల రైతుల ప్రతిన

తల్లాడ, డిసెంబరు 3: తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే రోడ్డు నిర్మాణానికి ఇచ్చేది లేదని అవసరమైతే ఢిల్లీ తరహా ఉద్యమం చేపడతామని రైతులు ప్రతినబూనారు. గురువారం తల్లాడ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవేలో భూములు కోల్పోతున్న తల్లాడ మండలంలోని రామానుజవరం, కేశ్వాపురం, పినపాక గ్రామాలకు చెందిన వందలాదిమంది మహిళలతో సహా రైతులు అవార్డు విచారణ సభకు భారీగా తరలివచ్చారు. జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో రైతులంతా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాష్ట్రీయ రహదారిని వెడల్పు చేసి జాతీయ రహదారిగా మార్చుకోవాలని వ్యవసాయ భూములను గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే పేరుతో తమకు దక్కకుండా చేయవద్దని వేడుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం సర్వే నిర్వహించిన సందర్భంగా తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పోలీస్‌ బందోబస్తుతో బలవంతంగా సర్వేచేయించారని దీనివలన సర్వే తప్పులతడకగా తయారైందని, పొలం ఉన్న రైతుకు బదులుగా మరో రైతు పేరు నమోదైందని ఆరోపించారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు తమ వ్యవసాయ భూములు తీసుకోవాల్సి రావడం అనివార్యమైతే ఎకరాకు రూ.50లక్షలు ధర చెల్లించాలని వెంటనే ఇందుకు సంబంధించి లిఖితపూర్వక ఒప్పందం చేసుకోవాలని రైతులు కోరారు. అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాల కోసమే గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు, భూసేకరణలో భూమికి బదులు భూమి ఇవ్వటం జరగదని, భూమికి ధర మాత్రమే చెల్లించటం జరుగుతుందన్నారు. ధర విషయంలో రైతుల డిమాండ్‌ను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే అథార్టీ ప్రాజెక్టు డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, తల్లాడ తహసీల్దార్‌ గంటా శ్రీలత, ఎంఆర్‌ఐ శ్రీనివాసాచారి పాల్గొన్నారు.


హైవే రైతుల కోసం ప్రధానిని కలుస్తాం: సండ్ర


గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహార విషయంలో న్యాయం జరిగేలా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీని జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కలవనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం తల్లాడ గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అవార్డు విచారణ సభనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవనాధారమైన రెండుపంటలు పండే భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతుల న్యాయమైన డిమాండ్‌ సాధన కోసం వచ్చేనెలలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా జిల్లామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి మోదీ, గడ్కరీలను కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరతామన్నారు. రాజకీయాలకతీతంగా గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే బాధిత రైతులకు న్యాయం జరిగేలా కలిసికట్టుగా కృషిచేస్తామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే హితవు పలికారు. గ్రీన్‌ఫీల్డ్‌ నేషనల్‌ హైవే రోడ్డు నిర్మాణానికి భూసేకరణ జరిపే రామానుజవరం గ్రామంలో ఓ రైతు ఎకరం రూ.14లక్షలకు విక్రయించిన దృష్ట్యా మార్కెట్‌ ధరకు మరో మూడురెట్లు అదనంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2020-12-04T04:46:00+05:30 IST