‘గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి’
ABN , First Publish Date - 2022-07-02T06:40:28+05:30 IST
గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులకు మార్కెట్ ధర ప్రకారం భూములకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
ఏలూరు రూరల్, జూలై 1 : గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులకు మార్కెట్ ధర ప్రకారం భూములకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం కలెక్టర్ పూర్తిస్థాయి చర్చలు జరిపి మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇచ్చి, ఆదుకోవాలని సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ పట్టిసీమ తరహాలో గ్రీన్ఫీల్డ్ హైవే భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వాల న్నారు. 2015లో ప్రభుత్వ జీవో 288 ప్రకారం పోలవరం కుడికాలువకు భూములిచ్చిన రైతులకు గరిష్టంగా రూ.52లక్షల వరకు పరిహారం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ కన్వీనర్ ఎం.సత్యనారాయణ, కో కన్వీనర్ జమ్ముల ఉదయభాస్కర్ మాట్లాడుతూ భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కారం చేసిన తరువాతే పనుల చేపట్టాలని డిమాండ్ చేశారు. మార్ని శ్రీనివాస్, చీకటి శ్రీనివాసరావు, కొట్టు కనక నరసింహారావు, వందనపు సాయిబాబు, చీకటి వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.