భూగర్భ జలాలు లోపలికి..
ABN , First Publish Date - 2022-08-14T05:25:31+05:30 IST
నాగర్కర్నూల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నా భూగర్భ జలాల పెరుగుదలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. గతేడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జలాలు స్వల్పంగా తగ్గాయి.
వర్షాలు కురుస్తున్నా కనిపించని పెరుగుదల
గత ఏడాది కంటే 0.08 మీటర్లు వెనక్కి..
జూలైలో 45 శాతం అధిక వర్ష పాతం
నాగర్కర్నూల్ జిల్లాలో ఇదీ పరిస్థితి
నాగర్కర్నూల్ టౌన్, ఆగస్టు 13: నాగర్కర్నూల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నా భూగర్భ జలాల పెరుగుదలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. గతేడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జలాలు స్వల్పంగా తగ్గాయి. గతేడాది కంటే ఈసారి జూలైలో వానలు జిల్లా సాధారణ వర్షపాతాన్ని మించి కురిసినా, భూగర్భ జలాల పెరుగుదలలో మార్పు లేదు. జిల్లాలోని 12 మండలాల్లో భూగర్భ జలాలు తగ్గగా, ఆరు మండలాల్లో స్వల్పంగా పెరిగాయి. రెండు మండలాల్లో ప్రమాదకరమైన లోతుకు చేరాయి. కానీ వర్షాలు మాత్రం రెండు మండలాలు మినహా అన్ని చోట్ల అధికంగానే కురిశాయి. వర్షాలు బాగా కురిసినా భూగర్భ జలాలు పెరుగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
లోపలికి..
జిల్లా భూగర్భ జలశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జూలైలో వర్షా లు అధికంగా కురిసినా, భూగర్భ జలాల సగటు లభ్యత మాత్రం 0.08 మీటర్ల మేర లోతుకు చేరింది. జిల్లా సాధారణ వర్షపాతం 642.3 మిల్లీ మీటర్లు కాగా, ఈ జూలై నెలాఖరు నాటికి 221.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గత ఏడాది ఇదే నెలలో 176.7మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. అంటే గతేడాదితో పోల్చితే 45 శాతం అధిక వర్షం కురిసింది. జిల్లాలోని పెంట్లవెల్లి, పదర మండలాల్లో సాధారణం కంటే తక్కువ కురువగా.. బల్మూరు, ఉప్పునుంతల, లింగాల మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణం కంటే 20 శాతం అధికంగా కురిసింది. జిల్లా మొత్తంగా 45 శాతం అధిక వర్షం కురిసింది. కానీ భూగర్భ జలాల విషయానికి వస్తే గతేడాది జూలైలో 6.61 మీటర్ల లోతులో లభించిన జలాలు ఈ సారి 6.69 మీటర్ల లోతుకు చేరాయి. అంటే 0.08 మీటర్లు తగ్గాయి. కురిసిన వర్షంతో పోల్చితే ఈ ఏడాది జలాలు పెరగాల్సి ఉండగా, స్వల్పంగా తగ్గడం గమనార్హం. జిల్లాలోని అచ్చంపేట, చారకొండ, కల్వకుర్తి, తాడూరు, తిమ్మాజిపేట, వంగూరు మండలాలు మినహా మిగతా మండలాల్లో 0.10 మిల్లీ మీటర్ల నుంచి 5.59 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గాయి. భూగర్భ జలాలు లోతుకు చేరిన మండలాల్లో పదర, పెంట్లవెల్లి తప్ప మిగతా మండలాల్లో జూలై వరకు సాధారణం కంటే వర్షం అధికంగానే కురిసింది.
నాగర్కర్నూల్లో అధిక లోతుకు..
ఈ ఏడాది నాగర్కర్నూల్ మండలంలో 38 శాతం అధికంగా వర్షం కురిసినా, భూగర్భ జలాలు మాత్రం ప్రమాదకరంగా గతేడాది కంటే 5.59 మీటర్ల మేర లోతుకు చేరాయి. నాగర్కర్నూల్ మండల సాధారణ వర్షపాతం 207.5 మిల్లీ మీటర్లు కాగా, జూలై వరకు 287.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గతేడాది జూలైలో 15.37 మీటర్ల లోతులో లభించిన భూగర్భ జలాలు.. ఈసారి 20.96లో లోతులో లభించడం ఆందోళన కలిగిస్తోంది.
పదేళ్లతో పోల్చితే పైనే..
గతేడాదితో పోల్చితే భూగర్భ జలాల లభ్యత స్వల్పంగా లోపలికి వెళ్లినప్పటికీ, భూగర్భ జలాల లభ్యత విస్తీర్ణం పెరిగింది. అలాగే గత పదేళ్లతో పోల్చితే ఈ సారి భూగర్భ జలాల లభ్యత పెరిగింది. భూగర్భ జలాలను సంరక్షించేందుకు కురిసిన ప్రతీ వర్షపు బొట్టును ఒడిసిపట్టి పొదుపుగా వాడాలి.
- రమాదేవి, జిల్లా భూగర్భ జలశాఖ అధికారి, నాగర్కర్నూల్