పరువు హత్యల కేసులో దోషికి మరణ శిక్ష

ABN , First Publish Date - 2022-03-16T23:06:42+05:30 IST

కుటుంబం పరువు పోయిందనే కారణంతో సొంత సోదరిని,

పరువు హత్యల కేసులో దోషికి మరణ శిక్ష

అహ్మదాబాద్ : కుటుంబం పరువు పోయిందనే కారణంతో సొంత సోదరిని, ఆమె భర్తను హత్య చేసిన హార్దిక్ చావ్డా (27)కు గుజరాత్‌లోని గ్రామీణ మీర్జాపూర్ సెషన్స్ కోర్టు  మంగళవారం మరణ శిక్ష విధించింది. 2018 సెప్టెంబరులో సనంద్ పట్టణంలో ఈ దారుణం జరిగింది. గర్భస్థ శిశువును, దంపతులను హత్య చేయడం అత్యంత అరుదైన నేరంగా అదనపు సెషన్స్ జడ్జి జేఏ ఠక్కర్ పేర్కొన్నారు. 


’’ఈ చర్యను తేలికగా తీసుకోకూడదు, దీనిని తేలికగా పరిగణిస్తే, సమాజంలోని మహిళలకు అన్యాయం చేయడమవుతుంది, మన సమాజంలోని పాత మనస్తత్వానికి ప్రోత్సాహం లభిస్తుంది, మహిళలపై ఆధిపత్యం చలాయించే సంఘటనలు, పరువు హత్యలకు ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు అవమానాలను భరించడం కొనసాగుతుంది, ఇది మన సామాజిక వ్యవస్థను నష్టపరుస్తుంది’’ అని జడ్జి ఠక్కర్ చెప్పారు. 


తరుణ (21), విశాల్ పర్మార్ (22) పెళ్లి చేసుకున్నారు. అనంతరం వేరొక గ్రామంలో కాపురం పెట్టారు. తరుణ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వారిద్దరూ మరణించడంతో హార్దిక్ కక్ష పెంచుకున్నాడు. 2018 సెప్టెంబరు 26న హార్దిక్ తన సోదరిని, ఆమె భర్తను దారుణంగా హత్య చేశాడు. అప్పటికి ఆమె గర్భిణి. 


విశాల్ పర్మార్ తల్లిదండ్రులకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని గ్రామీణ అహ్మదాబాద్  జిల్లా న్యాయ సేవల అథారిటీకి సెషన్స్ కోర్టు సిఫారసు చేసింది. కుమారుడు, కోడలు, గర్భస్థ శిశువు మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ కుటుంబం ముగ్గుర్ని కోల్పోయిందని తెలిపింది. హార్దిక్ రూ.61,000 జరిమానా చెల్లించాలని, గాయపడిన సాక్షికి రూ.50,000 చెల్లించాలని ఆదేశించింది. 


Updated Date - 2022-03-16T23:06:42+05:30 IST